రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మే 2న రాష్ట్రానికి వస్తున్నారు. పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రేయింబవళ్లు వందలాది మంది పనిచేస్తున్నారు. ప్రధాన వేదిక తోపాటు.. మిగిలిన వేదికలు, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు సిద్ధమవుతున్నాయి.
1.ప్రస్తుతం పైలాన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే సభికులను దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణంలో పెద్దఎత్తున కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు.
2.వాహనాలు నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ శాఖల అధికారులు సభాస్థలి వద్ద ఉండి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
3.ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో.. ఏర్పాట్లలో లోటుపాట్లు ఉండకూడదని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్థానికంగానే ఉంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు.
4.సోమవారం కల్లా పనులన్నీ పూర్తి చేసి సభా ప్రాంగణాన్ని ఎస్పీజీకి అప్పగించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పనులు పూర్తయితే.. బుధవారం ట్రయల్ రన్ నిర్వహిస్తామని పోలీసు స్పష్టం చేశారు.
5.వీవీఐపీల కాన్వాయ్ వచ్చిపోయే మార్గాలతోపాటు.. రోడ్షో సాగే రహదారుల్లో శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై పోలీస్ ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు.
6.హెలిప్యాడ్ ప్రదేశాన్ని ఐపీఎస్ అధికారులు పరిశీలించారు. సభాస్థలి వెనక వైపు ప్రధాని, ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా గ్రీన్రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి.
7.సభా ప్రాంగణానికి 8 మార్గాల్లో చేరుకునేలా రహదారులను సిద్ధం చేస్తున్నారు. సభ జరిగే చోటుకు నలువైపులా ఉన్న రహదారుల తోపాటు.. సీడ్ యాక్సెస్ మార్గాల్లో పలు ప్రాంతాల్లోని గుంతలను పూడ్చారు.
8.గుంటూరు కమిషనర్ ఆధ్వర్యంలో సభా ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నారు. గ్యాలరీలు, పార్కింగ్ ప్రదేశాల్లో తాగునీరు అందించటానికి ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాలనే అంశంపై జీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
9.రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సభాస్థలికి జనాల్ని తీసుకురావటానికి 2 వేలకు పైగా ఆర్టీసీ బస్సులను.. మరో 700 ప్రైవేటు బస్సులు వినియోగించనున్నట్టు తెలుస్తోంది.
10.మొదటి దశలో దాదాపు రూ.65,000 కోట్ల విలువైన పనులు చేపట్టనున్నారు. ఇందులో శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు నిర్మించనున్నారు. ఇప్పటికే రూ.41,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు కాగా.. మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయని తెలుస్తోంది.
సంబంధిత కథనం