కుAP Teachers Transfers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం 2025 ముసాయిదా సిద్ధమైంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం 2025 ను రూపొందించింది. ఇవాళ (01.03.2025) cse.ap.gov.in వెబ్సైట్లో ఉంచినట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ వెబ్ సైట్ ను సందర్శించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం -2025 పైన తగిన సలహాలు, సూచనలు చేయాలని విద్యాశాఖ సూచించింది. వెబ్ సైట్ లో ఉంచిన ప్రొఫార్మాలో మార్చి 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు draft.aptta2025@gmail.com కు పంపించాలని పాఠశాల విద్యాశాఖ కోరింది.
1. ముందుగా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ cse.ap.gov.in ను సందర్శించాలి.
2. అందుబాటులో ఉన్న ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకుని, తగిన వివరాలు నమోదు చేయాలి.
3. పూర్తయిన ప్రొఫార్మాను draft.aptta2025@gmail.com కి పంపించాలి.
"పారదర్శకమైన, న్యాయమైన బదిలీ ప్రక్రియకు మా నిబద్ధతకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 ముసాయిదాపై మీ విలువైన అభిప్రాయాన్ని ఆహ్వానిస్తున్నాము. 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే, మన విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే వ్యవస్థను రూపొందించడానికి ఈ చొరవ మా దార్శనికతను ప్రతిబింబిస్తుంది. https://cse.ap.gov.in/documents/DRAFT_TTA_2025_AP.pdf దయచేసి లింక్లో డాక్యుమెంట్ను కనుగొనండి. మీ సూచనలు, అభిప్రాయాలను పై ఫార్మాట్లో పంచుకోండి. వాటిని draft.aptta2025@gmail.com ఈ మెయిల్ కు 07-03-2025 సాయంత్రం 5 గంటలలోపు పంపండి. ఉపాధ్యాయులు, విద్యార్థులకు నిజంగా మద్దతు ఇచ్చే విధానాన్ని రూపొందిద్దాం" -మంత్రి లోకేశ్
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలపై కసరత్తు ప్రారంభమైంది. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాను తయారు చేసే కసరత్తులో జిల్లాల విద్యాశాఖ అధికారులు ఉన్నారు. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, విద్యాశాఖకు పంపాలని అధికారులను ఆదేశించారు.
వచ్చే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారులు తయారు చేస్తున్నారు. ఈ కసరత్తును ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారి కేడర్లో ఉన్న డీఈవోలను నిర్వహిస్తారు. ఆయా జిల్లాల్లో సీనియారిటీ జాబితాను తయారు చేయడానికి వివిధ కేడర్ ఉపాధ్యాయులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించారు.
ఒక్కో బృందానికి ఇద్దరు చొప్పున ఏర్పరచుకుని ఎలాంటి పొరపాట్లు లేకుండా చూస్తు్న్నారు. అనంతరం డీఈవో కార్యాలయాల్లో ఆన్లైన్లో అప్లోడ్ ప్రక్రియ చేస్తారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఐఎస్) ద్వారా ఉపాధ్యాయులు వ్యక్తిగత, సర్వీసుకు సంబంధించిన సమగ్ర వివరాల ఆధారంగా జాబితాను తయారు చేస్తున్నారు.
రాష్ట్రంలో 44 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం చేసిన ఉపాధ్యాయ బదిలీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. అప్పటి నుంచి ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. బదిలీలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం...తాజాగా ఈ చట్టం డ్రాఫ్ట్ ను వెబ్ సైట్ లో పెట్టింది.
సంబంధిత కథనం