Godavari Floods : ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు
కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. ధవళేశ్వరం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 15.07 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, ఔట్ఫ్లో నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు . రాష్ట్ర కంట్రోల్ రూమ్ నుంచి గోదావరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఏపీ విపత్తుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ చెప్పారు. ఈ మేరకు వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో వరద ప్రభావిత మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 5 NDRF, 4 SDRF బృందాలు సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, రాజమహేంద్రవరంలోని ఘాట్ వద్ద నీటిమట్టం 56 అడుగులకు చేరుకోవడంతో లంక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు ఈరోజు (జూలై 13) అర్ధరాత్రి భద్రాచలంలో ప్రవాహం 64 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమై ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి వరదల కారణంగా దాదాపు 2 లక్షల మంది నష్టపోయారు.