Kethireddy On NDA Govt : కూటమి సర్కార్ కు కొంత సమయం ఇవ్వాలి, హామీల అమలుపై వైసీపీ నేత కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Kethireddy On NDA Govt : సంపద సృష్టి, హామీల అమలుకు కూటమి సర్కార్ కు ఈ ఏడాది చివరి వరకూ సమయం ఇవ్వాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. కేతిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి.
Kethireddy On NDA Govt : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితం ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డికి ఓటర్ల షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత కేతిరెడ్డి సామాజిక మాధ్యమాల్లో కాస్త యాక్టివ్ ఉంటున్నారు. తాజాగా కేతిరెడ్డి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. హామీలను అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వానికి ఈ ఏడాది చివరి వరకు ప్రతి ఒక్కరు వేచి చూడాలని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. కేతిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీ హాట్ టాపిక్ అయ్యింది. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్న తరుణంలో...ఆ పార్టీకి చెందిన కీలక నేత కూటమి పార్టీకి సమయం ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను ఇరుకున పడేస్తున్నాయి.
జగన్ అలా...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి అతి దారుణంగా కత్తితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ స్వయంగా వినుకొండ వచ్చారు. బాధితులను పరామర్శించే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు కావడంలేదని మాట్లాడారు. బాధితుల పరామర్శలో రాజకీయ హామీలపై మాట్లాడడంపై జగన్ పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హామీల అమలుకు కూటమి సర్కార్ కు కొంత సమయం ఇవ్వాలని మాట్లాడడం సంచలనమైంది.
నెలలోనే అద్భుతాలు జరగవు
టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చింది. వీటిల్లో ఒకటైన పింఛన్ పెంపు అమలు చేసిన కూటమి ప్రభుత్వం...మిగిలిన వాటిని త్వరలోనే అమలు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించింది. సూపర్ సిక్స్ గ్యారంటీలను టార్గెట్ చేసిన వైసీపీ...వాటి అమలుపై జాప్యాన్ని ప్రశ్నిస్తుంది. పార్లమెంట్ సాక్షిగా సూపర్ సిక్స్ హామీలపై వైసీపీ ఎంపీలు విమర్శలు చేశారు. ఈ తరుణంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే అద్భుతాలు జరగవని, హామీలు నెరవేర్చేందుకు కొంత సమయం ఇవ్వాలన్నారని కేతిరెడ్డి మాట్లాడారు. కొత్త ప్రభుత్వం సంపద సృష్టించిన తర్వతా ఇస్తామని అన్నారని, సంపద సృష్టించడానికి సమయం ఇవ్వాలని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి మాట్లాడాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపించిన కూటమి నేతలు ఇప్పుడు... వారు కూడా అప్పులే చేస్తున్నారని కేతిరెడ్డి విమర్శించారు.
సినిమా టికెట్ల ధరల విషయంలో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి కలుగజేసుకున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. సినిమా ఫ్యాన్స్ ఎవరూ కూడా టికెట్లు ధరలు తగ్గించమని అడగలేదన్నారు. ఆ నిర్ణయం తీసుకోవడంతో సినిమా ఇండస్ట్రీకి జగన్ చెడ్డవారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నా బీసీ నా ఎస్టీ అన్నారే తప్ప మిగిలిన వారిని పట్టించుకోలేదని చెప్పారు.
సంబంధిత కథనం