Padmavati Park: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందనే భక్తుల విశ్వాసానికి తగ్గట్టుగా టీటీడీ ఏర్పాట్లు చేయకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద జరిగిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు ఉత్తరాంధ్రకు చెందిన వారు కాగా మరొకరు బళ్ళారి చెందిన మహిళ ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన మహిళలు ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఏం జరిగిందంటే…?
తిరుపతి తొక్కిసలాటలో 41మంది గాయపడ్డారని, వారిని స్విమ్స్, రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని, క్షతగాత్రుల్లో అత్యధికుల్ని సాయంత్రంలోగా డిశ్చార్జి చేయనున్నట్టు చెప్పారు. గాయపడిన వారిలో ఇద్దరు ముగ్గురికి మాత్రమే చికిత్స కొనసాగించాల్సిన స్థితిలో ఉన్నారన్నారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు తప్ప మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఇప్పటి వరకు 20మందిని డిశ్చార్జి చేసినట్టు తెలిపారు.
తిరుపతి ఎస్పీ , టీటీడీ జేఈఓ వెంకన్న చౌదరిలని సస్పెండ్ చేయాలని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు గుడి కట్టుకుని ఆయనకు సేవ చేసుకోవాలన్నారు. వెంకటేశ్వరుడి ఆలయంలో భక్తుల మనోభావాలను పరిరక్షించడానికి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన పనిచేయకుండా, వారంతా చంద్రబాబు సేవలో తరిస్తున్నారని భూమన ఆరోపించారు.లా అండ్ ఆర్డర్ అదుపు చేయాల్సిన పోలీసులు, తమ బాధ్యతల్ని విస్మరించడం వల్ల భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని తిరుపతిలో వీరతాడు వేసుకుని తిరిగిన పవనాననంద స్వామి, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని, సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతిలో తునాతునకలు చేస్తారో చెప్పాలన్నారు.
గేమ్ ఛేంజర్ ఈవెంట్లో ఇద్దరు చనిపోతే, రోడ్లు బాగోలేకపోవడానికి వైసీపీ మీద ఆరోపణలు చేశారని, ఇప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సనాతన ధర్మం పేరుతో మాయమాటలు చెబుతారు, ఆచరణలో అమలు చేయరని విమర్శించారు. చంద్రబాబు దేవుడితో పెట్టుకున్నారని, రాజకీయ వనరుగా, పావుగా వాడుకుని జగన్ మీద అభాండాలు వేసి, తిరుమల అపవిత్రం అయ్యిందని రాజకీయం చేశారని, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే దుర్మార్గపు ప్రచారాలకు ఇప్పుడు దేవుడే కన్నెర్ర చేశాడని మండిపడ్డారు.
తిరుమల ఆలయ పవిత్రత తాము కాపాడినంతగా ఇంకెవరు కాపాడలేదన్నారు. దమ్ముంటే తమతో చర్చకు సిద్దపడాలన్నారు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చేసిన ఆరోపణల గురించి బహిరంగ చర్చకు తాము సిద్ధమని, చంద్రబాబు మాయ మాటలు తగ్గించి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకోకుండా సరైన చర్యలు చేయాలన్నారు.
తిరుపతి ఘటనకు బాధ్యులైన ఈవోను బదిలీ చేయాలి, ఇతర అధికారుల్ని సస్పెండ్ చేయాలని మృతుల కుటుంబాలకు కోటి రుపాయల పరిహారం అందించాలని గాయపడిన వారికి రూ.20లక్షల పరిహారం చెల్లించాలని భూమన డిమాండ్ చేశారు. పరామర్శలతో కాలం గడిపేయడం సరికాదని తిరుపతిలో జరిగినవి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు.