పరిపాలనలో తనదైన ముద్ర వేసేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్నారు. ఓవైపు తనకు కేటాయించిన శాఖలపై నిత్యం సమీక్షలు చేస్తూ… అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు పలువురికి సాయం చేస్తూ తనలోని ఉదారతను చాటుకుంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని అనాథ పిల్లలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా తన నెల వేతనాన్ని ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు. ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం అందించనున్నారు. మిగిలిన వేతనం కూడా వారి బాగోగులకే ఖర్చు చేయనున్నారు. ప్రతి నెలా వారి ఇంటి వద్దనే అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పదవి ఉన్నంతకాలం సాయం కొనసాగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతోపాటు సమస్యల పరిష్కారం తన బాధ్యత అని ఉద్ఘాటించారు. శుక్రవారం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు తన వేతనం నుంచి ఒక్కొక్కరికీ నెలకి రూ. 5 వేల చొప్పున రూ. 2,10,000 ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. "పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా గెలిపించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితోపాటు సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత’ అని చెప్పారు.
“పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మొత్తం ఖర్చు చేయనున్నాం. పదవి ఉన్నంతకాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తాం” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
“రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న భావనతోనే వేతనం తీసుకున్నాను.నన్ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కన్నవారు దూరమైన పిల్లల భవిష్యత్తు కోసం, వారి చదువుల ఖర్చు చేయాలనుకున్నాను. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాల జీతం మొత్తం అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తాను” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ చెక్కులను అందజేశారు. అందుబాటులో ఉన్న 32 మందికి స్వయంగా పవన్ కల్యాణ్ చేతుల మీదుగా నగదును అందజేయగా… మిగిలిన పది మందికీ జిల్లా యంత్రాంగం ద్వారా అందజేయనున్నారు. ఇకపై ప్రతి నెలా ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
సంబంధిత కథనం