శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌.. బీజేపీలో చేరిక..-deputy chairperson zakia khanam resigns from legislative council membership a ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌.. బీజేపీలో చేరిక..

శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌.. బీజేపీలో చేరిక..

Sarath Chandra.B HT Telugu

ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖనమ్‌ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజుకు పంపారు. వైసీపీ తరపున 2020లో అన్నమయ్య జిల్లా నుంచి శాసన మండలికి ఎంపికయ్యారు.

శాసన మండలికి జకియా ఖనమ్‌ రాజీనామా

వైసీపీ శాసన మండలి సభ్యత్వానికి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జాకియా ఖనమ్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా జకియా ఖనమ్‌ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో జకియాపై తిరుమలలో దర్శనం టిక్కెట్ల వ్యవహారంలో కేసు నమోదైంది.

వైసీపీ శాసన మండలి సభ్యత్వానికి డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌ మయానా జకియా ఖనమ్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు పంపారు. అన్నమయ్య జిల్లా రాయచోటీకి చెందిన జకియా మండలిలో డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌గా ఉన్నారు. కొంత కాలంగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జకియా ఖనమ్ 2020 మండలికి ఎన్నికయ్యారు.

జకియా ఖనమ్‌పై గతంలో తిరుమలలో దర్శనం టిక్కెట్ల సిఫార్సు లేఖలను దళారులకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో జకియా ఖనమ్‌పై కేసు నమోదైంది. 2024 అక్టోబర్ 21న ఆమెపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.

బెంగుళూరుకు చెందిన సాయిశేఖర్‌ అనే భక్తుడు శ్రీవారి దర్శనం టిక్కెట్లను రూ.10వేల కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖపై రూ.500 విఐపీ బ్రేక్‌ దర్శనం టిక్కెట్లను తమకు రూ.10వేలకు విక్రయించినట్టు పిర్యాదు చేశాడు.

తమ నుంచి ఎమ్మెల్సీ సిబ్బంది రూ.65వేలు వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తిరుమల వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో జకియా ఖనమ్‌‌తో పాటు దళారీ చంద్రశేఖర్‌, ఆమె పీఆర్వో కృష్ణతేజలపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఈ ఆరోపణల్ని ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై కేసు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ కేసు తర్వాత జకియా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

జకియా ఖానమ్‌ అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుగురు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామాలు చేశారు.

కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌లు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. ఇవన్నీ ఇంకా మండలి ఛైర్మన్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

బీజేపీలో చేరిన జకియా…

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ మయానా జకీయా ఖానమ్ బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు జకియాకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో జకీయా బీజేపీలో చేరారు

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం