Darsi MLA : వైకాపాలోనే ఉంటా.. సీఎం జగన్ తోనే ప్రయాణం... దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి
Darsi MLA : వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తే లేదని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్పష్టం చేశారు. పార్టీ మార్పుపై వస్తోన్న ప్రచారాన్ని తిప్పికొట్టిన ఆయన... సీఎం జగన్ తోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని తేల్చి చెప్పారు.
Darsi MLA : పార్టీ మార్పుపై జరుగుతోన్న ప్రచారాన్ని దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్టు టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్న ఆయన... తాను వైఎస్ఆర్సీపీలోనే ఉంటానని... సీఎం జగన్ తోనే తన రాజకీయ ప్రయాణం సాగుతుందని చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల గత కొన్ని నెలలుగా అందుబాటులో లేనని పేర్కొన్నారు. గతంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నానని... కార్యకర్తలకు అందుబాటులో ఉండే వాడినని... కానీ గత రెండున్నర నెలల్లో వ్యక్తిగత కారణాల వల్ల నియోజకవర్గ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనలేకపోయానని వివరించారు. ఇకపై పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని పత్రికలు, ఛానల్లో పార్టీ మారబోతున్నట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
ట్రెండింగ్ వార్తలు
"సీఎం జగన్ ఒక గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడితో కలిసి నిలబడితే బాధ్యతగా మిగిలినట్టు.. అలా నిలబడకుండా తప్పించుకుంటే బాధ్యతలు లేని వ్యక్తులుగా చరిత్రలో నిలుస్తాం. 2019 ఎన్నికల్లో దర్శిలో జగన్ నాకు మద్దతుగా అండగా నిలబడ్డారు. గెలిచి ఆయనతో కలిసి కూర్చునేలా సీఎం జగన్ ప్రోత్సహించారు. ఇకపై కూడా సీఎం జగన్ చెప్పినట్టు వారి అడుగుజాడల్లో నడుస్తాను. ఆయనకు నా పైన నమ్మకం... నాకు ఆయనపై నమ్మకం ఉంది. నాకు ఎటువంటి అవకాశం వచ్చినా కూడా దర్శి ప్రాంత ప్రజలకు మంచి చేశాను. ముఖ్యంగా గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్తున్నాము" అని ఎమ్మెల్యే వేణుగోపాల్ తెలిపారు.
సీఎం జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి దర్శి నియోజికవర్గంలో పలు అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేశానని శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు. వాటిలో ముఖ్యంగా దర్శి పట్టణానికి 125 కోట్ల రూపాయలతో సమగ్ర నీటి పథకం ద్వారా నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేసి, ప్రతి ఇంటికి మంచినీటి కొళాయిలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న దర్శి - కురిచేడు రోడ్ నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంతో మేలు జరుగుతోందని వివరించారు.