Ambati Rayudu : 'అంబటి' పొలిటికల్ ఇన్నింగ్స్..! వైసీపీలో చేరటం ఖాయమేనా?
Ambati Rayudu Latest News: టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి సీఎం జగన్ భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందన్న చర్చ టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారింది.
Ambati Rayudu Political Innings: అంబటి రాయుడు... టీంఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా అందరికి తెలుసే...! అయితే కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు...గత కొద్దిరోజుల కిందటే ఏపీ క్యాంప్ ఆఫీస్ లో కనిపించిన ఆయన.... తాజాగా మరోసారి కూడా ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. ఈ పరిణామంతో... అంబటి పొలిటికల్ ఇన్నింగ్స్ కు దారులు పడినట్లే అన్న చర్చ జోరందుకుంది. అంతేకాదు.... ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటంతో పాటు... పోటీ చేసే స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంత కాలంగా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిపై జనసేన కూడా కన్నేసింది. ఇదే సమయంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా పార్టీలో చేరిక విషయంపై ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఇలా ఉంటే కొద్దిరోజుల కింద అంబటి రాయుడు... సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. కొద్దిరోజుల కింద సీఎం జగన్ చేసిన ప్రసంగాన్ని వైసీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా… అంబటి రాయుడు దాన్ని రీట్వీట్ చేశాడు. అంతేకాదు… ‘మన ముఖ్యమంత్రి జగన్ గారి గొప్ప ప్రసంగం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి సార్’ అంటూ రాసుకొచ్చాడు. ఈ క్రమంలో ఆయన ఫ్యాన్ పార్టీకి జై కొడుతారేమో అన్న ప్రచారం జోరందకుంది. ఈ క్రమంలోనే ఆయన సీఎం జగన్ తో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
త్వరలోనే వైసీపీ గూటికి...?
సీఎం జగన్ తో రెండో సారి భేటీ కావడంతో అంబటి రాయుడు వైసీపీలో చేరడం ఖాయమనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే త్వరలోనే కండువా కప్పుకుంటారని సమాచారం. ఆయన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కూడా కనిపిస్తోంది. పొన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయవచ్చన్న టాక్ ఉంది. ఇక్కడ్నుంచి వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు . ఒకవేళ ఆయనకు టిక్కెట్ నిరాకరిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనుకుంటే… ... నర్సరావుపేట ఎంపీ టిక్కెట్ కు కూడా ఫ్యాన్ పార్టీ హైకమాండ్ పరిశీలించవచ్చన్న అభిప్రాయాలు వినిబడుతున్నాయి.
మొత్తంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ ఆంధ్రా ఆటగాడు... పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ఆయన్నుంచి అధికారిక ప్రకటనలు మాత్రమే మిలిగిపోయినట్లు సీన్ ఉంది.
సంబంధిత కథనం