ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల విషయంలో వైసీపీ దారిలోనే కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తోందని సీపీఎం ఆరోపిస్తోంది. అదానీ- సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయకపోగా, విద్యుత్ రంగంలో మరింత భారం మోపే యాక్సిస్ ఒప్పందానికి ఆమోదం తెలపడం ప్రమాదకరమని, కార్పొరేట్ల దోపిడీ, పాలకుల అవినీతి ఫలితంగానే ప్రజలపై భారాలు పడుతున్నాయని ఆరోపించాయి.
ప్రజలపై శాశ్వతంగా భారాలు మోపేలా స్మార్ట్ మీటర్లను ప్రవేశపెడుతున్నారని, విద్యుత్ భారాలపై మాట తప్పి కూటమి ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని సీపీఎం ఆరోపించింది. విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లు, అవినీతి ఒప్పందాల రద్దుకై సిపిఎం ప్రజా ఉద్యమం చేపట్టింది.
మే 7వ తేదీన విజయవాడ విద్యుత్ సౌదా వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. దీనికోసం లక్షలాది సంతకాల సేకరణ చేపట్టారు. విజయవాడ లెనిన్ సెంటర్ లో సంతకాలు సేకరణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్ పాల్గొన్నారు.
ఏపీలో విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఆపాలని, ఆదాని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాభేరి కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ జరిపారు
వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. విద్యుత్ భారాలపై నిరసన తెలిపారు విజయవాడ నగరంలో గత మూడు రోజుల నుండి లక్షలాదిమంది ప్రజల సంతకాలు సిపిఎం కార్యకర్తలు సేకరిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు, స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని ఇంటింటికి స్టిక్కర్ల అంటిస్తున్నారు.
ఈనెల 7వ తేదీన విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌదా వద్ద భారీ ఎత్తున నిరసనకు సిద్ధమవుతున్నారు.విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ దోపిడీని తీవ్రతరం చేశాయని, కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలు పెంచబోమని హామీ ఇచ్చి మాట తప్పింది. నమ్మకద్రోహం చేసిందని నేతలు ఆరోపించారు.
నాలుగు రకాల సర్దుబాటు చార్జీల పేరుతో ప్రతి ఒక్కరి నుండి ఏటా15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ బాదుడు ఆపుతామని హామీ ఇచ్చి నేడు కూటమి ఉమ్మడి బాదుడు తీవ్రతరం చేసిందని, భవిష్యత్తులో మరిన్ని భారాలు మోపటానికి ఒప్పందాలు చేస్తున్నారని ఆరోపించారు.
అదానీ సంస్థతో సెకీ ఒప్పందంలో రూ 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని గత రాష్ట్ర ప్రభుత్వం 25 సంవత్సరాల పాటు సోలార్ విద్యుత్ సరఫరా చేసే ఒప్పందాన్ని ఆమోదించిందని, లక్షా 20 వేల కోట్ల రూపాయల భారం మోపే ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు ఆ ఒప్పందాన్ని కొనసాగించడం మోసపూరితం అని ఆరోపించారు.
రూ.2.49 పైసలకు సోలార్ విద్యుత్ కొనే ఒప్పందాన్ని అధిక భారం అని చెప్పిన తెలుగుదేశం. యాక్సిస్ సంస్థతో యూనిట్ రూ.4.60 పైసలు చెల్లించే ఒప్పందానికి ఆమోదముద్ర వేయటం శోచనీయమన్నారు.
25 సంవత్సరాల పాటు సోలార్ విద్యుత్ రేటు తగ్గినా రూ.. 4.60 పైసలు చెల్లించే రీతిలో ఒప్పందం చేసుకోవడం దారుణమని, సమ్మిళిత విద్యుత్ పేరుతో పాలకులు మోసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం వల్ల 14 వేల కోట్ల రూపాయలు అదనపు భారం జనం పై పడుతుందని, ఆదాని, హిందూజా, యాక్సిస్ తదితర బడా సంస్థలతో అడ్డగోలు ఒప్పందాలు చేసుకొని పాలకులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ హయాంలో యూనిట్ విద్యుత్ ను కేవలం రూ.2.49 కు మాత్రమే కొనుగోలు చేశామని జగన్ అబద్ధాలు చెబున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ ను దాదాపు రూ.5 కంటే ఎక్కువ ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
యాక్సిస్ కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై వైసీపీ నాయకులు సత్య దూరమైన మాటలు చెప్తున్నారని మంత్రి వివరించారు. యాక్సిస్ తో చేసుకున్న ఒప్పందం వందకు వంద శాతం సక్రమమే అని పేర్కొన్నారు. యాక్సిస్ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపేణా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. స్వలాభం కోసం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు, ప్రజా అవసరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలకు చాలా తేడా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
సెకీ కేవలం సోలార్ ఎనర్జీ మాత్రమేనని తెలిపిన మంత్రి గొట్టిపాటి.., యాక్సిస్ కంపెనీ సోలార్, విండ్ తో పాటు బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తుందని, దీని ద్వారా ప్రజావసరాలు, విద్యుత్ వినియోగం మేరకు అవసరమైన మేరకు మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం