Ex MP Vijayasai Reddy : జగన్ చుట్టూ కోటరీ, విరిగిన మసస్సు మళ్లీ అతుక్కోదు- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు-coterie around jagan political turmoil with ex mp vijayasai reddy comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ex Mp Vijayasai Reddy : జగన్ చుట్టూ కోటరీ, విరిగిన మసస్సు మళ్లీ అతుక్కోదు- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ex MP Vijayasai Reddy : జగన్ చుట్టూ కోటరీ, విరిగిన మసస్సు మళ్లీ అతుక్కోదు- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ex MP Vijayasai Reddy : వైఎస్ జగన్ చుట్టూ కోటరీ చేసిందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలి. నాయకుడు ఎప్పుడూ చెప్పుడు మాటలు నమ్మకూడదు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, పార్టీ నష్టపోతారన్నారు.

జగన్ చుట్టూ కోటరీ, విరిగిన మసస్సు మళ్లీ అతుక్కోదు- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ex MP Vijayasai Reddy : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళగిరి సీఐడీ పోలీసులు ముందు విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్‌ అధిపతి కేవీ రావు నుంచి బలవంతంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని సీఐడీ పోలీసులు ప్రశ్నించారు. వాటాలు బలవంతంగా లాక్కున్నారా? ఇందులో ఎవరి పాత్ర ఉంది? వంటి విషయాలపై విజయసాయిరెడ్డిని సీఐడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 11 నుంచి దాదాపు 3:30 గంటలపాటు విజయసాయిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. కేవీ రావు ఫిర్యాదుతో విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్, అరబిందో రియాల్టీ ఇన్ ఫ్రాపై సీఐడీ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

జగన్ చుట్టూ కోటరీ

సీఐడీ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. "వైఎస్ జగన్‌ చుట్టూ కోటరీ చేరింది. ఆ కోటరీ వల్లే ఆయనకు దూరమయ్యాను. జగన్‌ మనసులో నేను లేనని తెలిశాక నా మనసు విరిగిపోయింది. ఆయనకు ఫోన్ చేసి పార్టీని వీడుతున్నట్లు చెప్పాను. చుట్టూ చేరిన కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుంది. జగన్‌ ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలి. నాయకుడు ఎప్పుడూ చెప్పుడు మాటలు నమ్మకూడదు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, పార్టీ నష్టపోతారు. ఈ కోటరీ వల్ల నేను ఆయనకు దూరం అయ్యాను.

విరిగిన మసస్సు మళ్లీ అతుక్కోదు

"విరిగిన మనస్సు మళ్లీ అతుక్కోదు. ఆయన మనసులో స్థానం లేదనే రాజకీయాలు వదిలేశా. జగన్ కోటరీలో ఇరుక్కుపోయారు. ఆయన కోటరీ నుంచి బయటకు రావాలి. మూడేళ్లు అవమానాలు పడ్డా. నా కూతురుని ఆ కుటుంబానికి ఇచ్చా కానీ..ఆ కుటుంబ వ్యాపారాలతో నాకేం సంబంధం. కేవీ రావు, వైవీ సుబ్బారెడ్డి స్నేహితులు. సుబ్బారెడ్డి అమెరికా వెళ్తే కేవీ రావు ఇంట్లోనే ఉండేవాడు. ఈ కేసు ఎందుకు పెట్టారో, ఎవరు చెప్తే పెట్టారో నాకు అర్థమైంది"- విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ

లిక్కర్ స్కామ్ పై

లిక్కర్ స్కామ్ లో కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అనేది చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను. భయం ఈ బ్లడ్ లోనే లేదు. గతంలో నాయకుడిపై భక్తి ఉండేది. ఇప్పుడు దేవుడిపై ఉంది. నాకు ఇన్ని పదవులు ఇచ్చారు. కానీ చాలా అవమానాలు ఎదుర్కొన్నాను" - విజయసాయి రెడ్డి

"కాకినాడ పోర్టులో వ్యాపారం చేశారా? కోట్లు ఆర్జించారా? అన్న విషయం నాకు తెలియదు. ఈ విషయాన్నే సీఐడీ విచారణలో చెప్పాను. గతంలోనూ సీబీఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో నన్ను ఏ2గా పెట్టారు. కాకినాడ పోర్టు కేసులో కూడా నన్ను ఏ2గా చేర్చారు. ఈ కేసు రిజిస్టర్‌ అయ్యే సమయానికి నేను వైసీపీలోనే ఉన్నాను. ఈ కేసుపై నాకు పూర్తి అవగాహన వచ్చింది. విచారణలో...జగన్‌ ను కేసు నుంచి పక్కకు తప్పించడానికి మీరూ, విక్రాంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా? అని అడిగారు. అవన్నీ నాకు తెలియమని చెప్పాను"- మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

"మా అల్లుడు శరత్‌ చంద్రారెడ్డి కంపెనీ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను. నాకు కుటుంబ సంబంధాలే ముఖ్యం. ఈ కేసులో జగన్‌ ప్రమేయం ఉందా? అని అడిగారు. నాకు తెలిసినంత వరకు కేవీరావు, శరత్‌ చంద్రారెడ్డికి డీల్‌ చేసింది.. కర్త కర్మ క్రియ విక్రాంత్‌రెడ్డేనని చెప్పాను. అవసరమైతే పిలుస్తామని అన్నారు" -విజయసాయి రెడ్డి

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం