ఏపీలో అంగన్‌ వాడీ టీవీ కొనుగోళ్లలో అవినీతి.. అస్మదీయులకు మేలు చేసేలా నిబంధనలు.. రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీల ఫిర్యాదు-corruption in anganwadi tv purchases in ap regulations favoring affiliated companies complaint to the government ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో అంగన్‌ వాడీ టీవీ కొనుగోళ్లలో అవినీతి.. అస్మదీయులకు మేలు చేసేలా నిబంధనలు.. రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీల ఫిర్యాదు

ఏపీలో అంగన్‌ వాడీ టీవీ కొనుగోళ్లలో అవినీతి.. అస్మదీయులకు మేలు చేసేలా నిబంధనలు.. రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీల ఫిర్యాదు

Sarath Chandra.B HT Telugu

పేదపిల్లలు ఓనమాలు దిద్దుకునే అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవ్వాల్సిన టీవీల్లో కూడా అధికారులు కక్కుర్తి పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పెద్ద సంఖ్యలో టీవీలు కొనుగోలు చేసే అవకాశం రావడంతో అక్రమాలకు తెరతీశారు. ప్రముఖ బ్రాండ్లు పోటీ పడకుండా నిబంధనల్ని రూపొందించి లాభపడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంగన్‌ వాడీ కేంద్రాల్లో స్మార్ట్‌ టీవీ కొనుగోళ్లలో అక్రమాలు (ఫైల్ ఫోటో) (Dr. S. Jaishankar-X)

రూ.25వేల లోపు బడ్జెట్‌తో స్మార్ట్ టీవీ కొనమని కేంద్రం డబ్బులు ఇస్తే ఎవరైనా ఏమి చేస్తారు. మార్కెట్‌లో ఉన్న ప్రముఖ బ్రాండ్లలో ఆ ధరకు ఏది వస్తుందో దానిని కొనేందుకు మొగ్గు చూపిస్తారు. క్వాలిటీ, వారంటీ, సర్వీస్, ఇతర సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఏపీలో మాత్రం అవేమి కాకుండా గతంలో ప్రభుత్వానికి సరఫరా చేయడాన్నే ప్రామణికంగా తీసుకుని టెండర్లకు ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.

కేంద్ర నిధులతో అంగన్‌ వాడీలకు అదనపు హంగులు

కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలోని 10వేల అంగన్‌వాడీ కేంద్రాల కోసం స్మార్ట్‌ టీవీ కొనుగోళ్ల తీరు వివాదాస్పదంగా మారింది. ప్రముఖ బ్రాండ్లను బిడ్డింగ్‌లో పాల్గొననివ్వకుండా టెండర్లు ఏకపక్షంగా సాగేలా అస్మదీయ సంస్థ లబ్ది చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయంలో చక్రం తిప్పిన కంపెనీలకే మళ్లీ టెండర్లు దక్కేలా ఏపీటీఎస్‌ అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

అంగన్‌ వాడీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు కొనసాగే ఈ ప్రాజెక్టులో 2024-25 ఏడాదికి గాను తొలి విడతగా పదివేల అంగన్‌ వాడీ కేంద్రాలను.. సాక్షం అంగన్‌ వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. ఈ పథకంలో అంగన్‌వాడీల్లో మౌలిక సదుపాయాలు, వసతులు మెరుగు పరుస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. 60శాతం కేంద్ర నిధులు 40శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి అంగన్‌ వాడీల్లో సదుపాయాలు కల్పిస్తారు.

సాక్షం అంగన్‌వాడీ పథకంలో వచ్చే సదుపాయాలు..

సాక్షం పథకంలో భాగంగా ఒక్కో కేంద్రంలో పోషన్ వాటిక(కిచెన్‌) ఏర్పాటుకు రూ.10వేలు, వర్షపు నీటి గుంతలకు రూ.16వేలు, ఆర్వో వాటర్‌ యూనిట్‌కు రూ.10వేలు, ఎల్‌ఈడి స్మార్ట్‌ టీవీకి రూ.25వేలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.39వేలు కేటాయించారు.

టీవీల కొనుగోలులో చేతివాటం...

2024-25 ఆర్థిక సంవత్సరంలో అంగన్‌ వాడీ కేంద్రాలకు అందించేందుకు టీవీల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని పలు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జరిగిన పరిణామాలపై ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి.తాజాగా ఈ లేఖలు వెలుగులోకి వచ్చాయి.

కేంద్ర నిధులతో ఏపీలో భారీ ఎత్తున టీవీలు కొనుగోలు చేయడంతో ప్రముఖ బ్రాండ్లు అన్ని బిడ్డింగ్‌ దక్కించుకోడానికి ప్రయత్నించాయి. దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రముఖ బ్రాండ్లకు బదులు అంతగా గుర్తింపు లేని బ్రాండ్‌కు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరగడంతో ఇది వివాదంగా మారింది.

టెండర్లను రద్దు చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ

స్త్రీ శిశు సంక్షేమ ఆధ్వర్యంలో నడిచే అంగన్‌ వాడీ కేంద్రాలకు స్మార్ట్‌ టీవీలు కొనుగోలు చేస్తుండటంతో కాంట్రాక్టు దక్కించుకునేందుకు గత అక్టోబర్‌లో అన్ని ప్రముఖ సంస్థలు పోటీ పడ్డాయి. ప్రాజెక్టులో భాగంగా దశల వారీగా టీవీలను కొనుగోలు చేయనుండటంతో ఎల్‌జి, పానాసోనిక్‌, శామ్‌సంగ్‌ వంటి సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. దీనికోసం ఈ మార్కెట్‌ జెమ్‌ పోర్టల్‌లో టెండర్లను ఆహ్వానించారు.

టెండర్లలో మొత్తం 11 కాంట్రాక్టు సంస్థలు పాల్గొనగా వాటిలో ఆరింటిని సాంకేతికంగా అర్హత లేనివిగా ప్రకటించారు. అక్టోబర్‌లో నిర్వహించిన టెండర్లలో ఎయిర్‌ వేవ్ కమ్యూనికేషన్స్‌, బృహస్పతి టెక్నాలజీస్‌, సెల్‌కాన్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, సెంట్రల్ గవర్నమెంట్‌ ఎంప్లాయి కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, ఫాక్స్‌ స్కై ఈసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రేవ్ ఐటీ సిస్టమ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, హైపర్ ఇండియా, ఇందూ ట్రేడర్స్‌, ఎస్వీఎస్ టెక్నాలజీస్‌, ట్రాన్స్‌లైన్‌ టెక్నాలజీస్‌, విఏ ఇన్ఫో సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటె్ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి.

నిబంధనల్లోనే అసలు కిటుకు…

టీవీల కొనుగోలుకు అర్హత ప్రమాణాలను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌లో ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం, స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్ణయించారు. సాంకేతిక అర్హత సాధించిన సంస్థలతో ధర విషయంలో బేరసారాలు కొలిక్కి రాకపోవడంతో గత అక్టోబర్‌లో టెండర్లను రద్దు చేశారని బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలు ఆరోపిస్తున్నాయి.

టెండర్లలో పాల్గొన్న ప్రముఖ సంస్థలు మార్కెట్‌లో గిట్టుబాటు ధరకు, కనీస లాభాన్ని కలుపుకుని టెండర్‌ వేశామని కాంపీటిటివ్‌ బిడ్డింగ్ కావడంతో ముడుపులు చెల్లించడానికి నిరాకరించడం వల్లే వాటిని రద్దు చేసినట్టు చెబుతున్నారు.

నిధులు మురిగిపోకుండా మళ్లించి…

గత ఏడాది అక్టోబర్‌లో టెండర్లు రద్దైన తర్వాత 2024-25 సంవత్సరానికి కేంద్రం నుంచి మంజూరైన నిధులను ఖర్చు చేయకపోతే వాటిని వెనక్కి తిప్పి పంపాల్సి ఉండటంతో టీవీలు కొనాల్సిన డబ్బును స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఏపీటీఎస్‌కు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది పిబ్రవరిలో స్మార్ట్‌ టీవీల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించారు. వాటిలో ప్రముఖ బ్రాండ్లు ఏవి పాల్గొనే అవకాశం లేకుండా నిబంధనలు విధించారు.

మొదటి సారి టెండర్లు పిలిచినపుడు..ఒక్కో స్మార్ట్‌ టీవీ కొనుగోలుకు కేంద్రం రూ.25వేలు కేటాయించడంతో టాప్‌ 3లో ఉన్న బ్రాండ్లు రూ.23,400 నుంచి ఒక్కో ధరను కోట్ చేశాయి. యూనిట్‌పై కొంత లాభం ఉండేలా ధరను కోట్ చేసినట్టు తెలుస్తోంది. గత ఫిబ్రవరిలో టెండర్లు పిలిచిన సమయంలో ప్రముఖ బ్రాండ్లు వేటికి టెండర్లలో పాల్గొనే అవకాశం దక్కలేదు.

అనుభవం పేరుతో అందరినీ తప్పించేశారు..

ఏపీటీఎస్‌ ఉన్నతాధికారులు నిబంధనల పేరుతో ఓ సంస్థకు మేలు చేకూర్చేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి ఆర్డర్‌ దక్కితే ఐదేళ్లలో కనీసం 50వేల టీవీల ఆర్డర్‌ లభించే కాంట్రాక్ట్ కావడంతో శాంసంగ్‌, పానాసోనిక్‌, ఎల్‌జి వంటి ప్రముఖ బ్రాండ్లు కాంట్రాక్ట్ దక్కించుకోడానికి తీవ్రంగా పోటీ పడ్డాయి.

ఈ క్రమంలో మార్కెట్‌లో పెద్దగా పేరు లేని బ్రాండ్‌కు కాంట్రాక్ట్‌ దక్కడం వెనుక ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. తొలిసారి బిడ్డింగ్‌ నిర్వహించినపుడు కమిషన్ల చెల్లింపుకు అంగీకరించక పోవడంతోనే వాటిని రద్దు చేశారని ఆరోపిస్తున్నారు.

రెండోసారి టెండర్లను పిలిచినపుడు గతంలో ప్రభుత్వానికి టీవీలు సరఫరా చేసి ఉండాలనే నిబంధన చేర్చారని, నాడు నేడు పథకంలో ఓ సంస్థ 9,800 టీవీలను సరఫరా చేయడంతో అదే సంస్థ అర్హతగా నిబంధనలు రూపొందించారని టెండర్లలో పాల్గొన్న సంస్థలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ ద్వారా నాడు నేడు పథకంలో భాగంగా ఓ సంస్థకు కాంట్రాక్ట్ దక్కిందని, అదే సంస్థ మళ్లీ టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వానికి ఫిర్యాదు...

అంగన్ వాడీ కేంద్రాలకు అందించే టీవీల వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు ఆ శాఖ ఉన్నతాధికారికి తెలియకుండా కింది స్థాయి అధికారులు జాగ్రత్త పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఐటీ అండ్‌ సీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శాంసంగ్‌ సంస్థ ఫిర్యాదు చేసింది. ఏపీటీఎస్‌లో జరుగుతున్న పరిణామాలను లేఖలో పేర్కొన్నారు.అంగన్‌ వాడీ కేంద్రాలకు నాసిరకం టీవీలను కొనుగోలు చేయడం వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వానికి శాంసంగ్ ఇండియా ఫిర్యాదు…

టెండర్ల వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై ఏప్రిల్ 21న శాంసంగ్ ఇండియా ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎంఓ, ఐటీఈ అండ్ సీ కు లేఖ రాసింది. ఐసీడీఎస్‌కు 9664 టీవీల సరఫరాకు శాంసంగ్ ఇండియా గతంలో అర్హత సాధించిందని ఆ టెండర్లను రద్దు చేశారని , ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ పిలిచిన టెండర్లలో తమకు అర్హత దక్కలేదని పేర్కొన్నారు. ఏపీటీఎస్‌ నిబంధనల్ని మార్చి టెండర్లు పిలవడంపై ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం