అమరావతిలో కేంద్ర సంస్థలకు భూములు కేటాయించినా మొదలుకాని నిర్మాణాలు.. మోదీ ప్రభుత్వ తీరుపై సీపీఎం ఆందోళన-constructions in amaravati have not started despite allocating land to central institutions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అమరావతిలో కేంద్ర సంస్థలకు భూములు కేటాయించినా మొదలుకాని నిర్మాణాలు.. మోదీ ప్రభుత్వ తీరుపై సీపీఎం ఆందోళన

అమరావతిలో కేంద్ర సంస్థలకు భూములు కేటాయించినా మొదలుకాని నిర్మాణాలు.. మోదీ ప్రభుత్వ తీరుపై సీపీఎం ఆందోళన

Sarath Chandra.B HT Telugu

రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణం పట్ల మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని, అమరావతిలో 41 సంస్థలకు 300 ఎకరాల భూములు కేటాయించినా పనులు ముందుకు సాగలేదని, అమరావతికి మోదీ శంకుస్థాపన చేసి 3474 రోజులు గడిచినా ఎలాంటి పురోగతి లేదని సీపీఎం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూముల్లో సీపీఎం నేతలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణంపై మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజధానిలో 41 సంస్థలకు 300 ఎకరాలు పైగా కేటాయించినా ఇప్పటి వరకు పనులు ముందుకు సాగలేదని చెబుతోంది.

అమరావతి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేసి 3474 రోజులు గడిచినా ఒక్క సంస్థ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాలేదని ఆరోపిస్తున్నారు. ఆరు నెలల్లోగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పనులు పూర్తి చేసేలా మోదీ ఆదేశాలు ఇవ్వాలని వాటిని నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

  • రాజధానిలో వృధాగా పడి ఉన్న స్థలాలను, అరకొరగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలను సీపీఎం నేతలు పరిశీలించారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరు, రాయపూడి తదితర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వసంస్థలు, కార్యాలయాలకు కేటాయించిన స్థలాలను, నిలిచిపోయిన నిర్మాణాలను సీపీఎం నేతలు సందర్శించారు.

  • మే రెండో తేదీన ప్రధాని మోడీ రాజధానికి పర్యటనకు రాబోతున్న సందర్భంలోకేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాలు, వాటి పురోగతిని పరిశీలించారు
  • రాయపూడి పరిధిలోని జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు కేటాయించిన రెండు ఎకరాలు స్థలం, ప్రహరీ గోడల వరకే పరిమితం అయ్యాయి. అరకొరగా సాగుతున్న ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కార్యాలయం భవన నిర్మాణాలను పరిశీలించారు.
  • రాజధాని అమరావతిలో 114 ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు 1277ఎకరాలు సిఆర్డిఏ కేటాయించింది. అందులో 41 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలు, కార్యాలయాలకు 300 ఎకరాలు కేటాయించారు. భూమి కేటాయించి తొమ్మిదేళ్లు గడిచినా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.
  • మే రెండో తేదీన ప్రధాని మోడీ రాజధాని పనుల పునః ప్రారంభానికి రాబోతున్నారని, ప్రధాని అమరావతికి శంకుస్థాపన చేసి 3474 రోజులు గడిచాయని, ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి యెడల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని ఆరోపించారు.
  • కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణాల పట్ల వివక్ష ప్రదర్శించిందని పలు కార్యాలయాలకు కేటాయించిన స్థలాలను కనీసం స్వాధీనం చేసుకోలేదని, ఒప్పందాలు చేసుకోలేదు, నిధులు కేటాయించలేదు. అనుమతులు మంజూరు చేయలేదని ఆరోపించారు.
  • అతికొద్ది సంస్థలు మాత్రమే ప్రహరీ గోడలు కట్టారు. వెళ్లపై లెక్కించగలిగిన సంస్థల నిర్మాణాలు మాత్రమే ప్రారంభించారని వివరించారు.
  • అత్యంత ప్రతిష్టాత్మకమైన రిజర్వ్ బ్యాంక్, సిఏజి, సిబిఐ, నేవీ, ఆర్మీ, పోస్టల్ , ప్రభుత్వ బ్యాంకులు, ఎల్ఐసి, ఆయిల్ సంస్థలు, హడ్కో, ఫ్యాషన్ టెక్నాలజీ, కేంద్రీయ విద్యాలయాలు, పలు సాంకేతిక సంస్థలకు... స్థలాలు కేటాయించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని, బీజేపీ నేతలు మాటలే తప్ప చేతలు లేవని అమరావతిపై కపట ప్రేమ కురిపించడం తప్ప నిర్మాణాల ఊసే ఎత్తటం లేదని ఆరోపించారు.
  • కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు నిర్మాణాలు జరిగి ఉంటే ఉపాధి లభించేది, అభివృద్ధికి వూతం వచ్చేది. వివిధ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకునేవి, రాజధాని అభివృద్ధిలో కీలకపాత్ర వహించేవని వివరించారు. మోడీ పర్యటన సందర్భంగానైనా కేంద్ర ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆరు నెలల లోపల పూర్తి చేయటానికి అనుమతులు ఇవ్వాలి, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

రాజధాని నిధుల్ని గ్రాంటుగా ఇవ్వాలి…

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రాంటుగా ప్రకటించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని సీపీఎం రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2వ తేదిన విచ్చేస్తున్న సందర్భంగా మోడీకి సిపిఎం రాష్ట్రకమిటీ బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబూరావు విజయవాడలో విడుదల చేశారు.

మోదీకి బహిరంగ లేఖ రాసిన సీపీఎం
మోదీకి బహిరంగ లేఖ రాసిన సీపీఎం

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం