CM Jagan Review : రూ.3,364 కోట్లతో హాస్టళ్లలో నాడు – నేడు.. సీఎం గ్రీన్ సిగ్నల్-cm ys jagan review on women and child welfare development ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Ys Jagan Review On Women And Child Welfare Development

CM Jagan Review : రూ.3,364 కోట్లతో హాస్టళ్లలో నాడు – నేడు.. సీఎం గ్రీన్ సిగ్నల్

HT Telugu Desk HT Telugu
Nov 18, 2022 04:37 PM IST

cm jagan review updates: అంగన్‌వాడీల్లో నాడు-నేడు అమలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు సీఎం జగన్. అంగన్‌వాడీలు, సంక్షేమ హాస్టళ్లపై శుక్రవారం సమీక్షించిన ఆయన.. కీలక ఆదేశాలు జారీ చేశారు.

మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష
మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష (twitter)

cm jagan review on women and child welfare development:అంగన్‌వాడీలు, సంక్షేమ హాస్టళ్లపై సీఎం జగన్ సమీక్షించారు. రూ.3,364కోట్లతో హాస్టళ్లలో నాడు-నేడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం తొలి విడత కింద రూ.1500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అంగన్‌వాడీల్లో నాడు-నేడుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. పిల్లలకు మంచి మౌలిక సదుపాయాలతో పాటు కిచెన్ల ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా అంగన్‌వాడీలలో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అంగన్‌వాడీలలో టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. అనంతరం గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో నాడు – నేడుపై సమీక్షించారు ముఖ్యమంత్రి. మొత్తం మూడు దశల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని... హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలన్నారు. హాస్టళ్లలో వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదన్నారు. వారు బాగా చదువుకోవడానికి, వారు బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని చెప్పారు. హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్‌ బెడ్స్‌.. తదితర సౌకర్యాలన్నీ కూడా నాణ్యతతో ఉండాలన్న ముఖ్యమంత్రి.... భవనాలను పరిగణలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా మొదట విడతలోనే బాగు చేయాలన్నారు సీఎం జగన్. మొదట విడతకు దాదాపుగా రూ.1500 కోట్లు, మొత్తంగా సుమారు రూ.3364కోట్ల వరకూ హాస్టళ్లలో నాడు – నేడు కోసం ఖర్చు అవుతుందని... తొలివిడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

"హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను ప్రతి హాస్టల్‌ కిచెన్‌ కోసం కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయంగా మార్పులు కనిపించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యతతో అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాలవారీగా పర్యవేక్షణ ఉండాలి. హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్‌ టేకర్ల పోస్టులను భర్తీచేయాలి" అని సీఎం ఆదేశించారు.

ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో క్లాస్‌ –4 ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలని... ప్రతి హాస్టల్‌ను పరిశీలించి... కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి. హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే.. ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్‌ ఉంచాలన్నారు.

IPL_Entry_Point