CM Jagan Review : రోడ్ల నిర్వహణపై 'ఏపీ సీఎం ఎంఎస్' యాప్.. CM జగన్ కీలక ఆదేశాలు
CM YS Jagan Review: పురపాలక పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్ సమీక్షించారు. మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
CM YS Jagan On Department of Urban Development: నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు సీఎం జగన్. పురపాలక పట్టణాభివృద్ధిశాఖపై శుక్రవారం సమీక్షించిన ముఖ్యమంత్రి....పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఏపీ సీఎం ఎంఎస్ యాప్…
దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం... ‘‘ఏపీ సీఎం ఎంఎస్’’ (ఏపీ కన్సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) యాప్ను తీసుకురానుంది. మరో నెలరోజుల్లో ఈ యాప్ సిద్ధమవుతోంది. రోడ్లపై గుంతలు, రోడ్లకు మరమ్మతులు, పచ్చదనం, సుందరీకరణ, వీధిలైట్లు, నిర్వహణ, పుట్పాత్స్, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, భూగర్భ మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, పబ్లిక్ టాయ్లెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ట్రాఫిక్ జంక్షన్లు, వాటి నిర్వహణ అంశాలపై యాప్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేయనున్నారు. వార్డు సచివాలయాల పరిధిలో ఈ మౌలికసదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటలవరకూ తనిఖీలు చేయనున్నారు. తమ పరిధిలోని సుమారు 6–7 కి.మీ. మేరరోడ్లపై నిరంతర పర్యవేక్షణతోపాటు, పైన పేర్కొన్న వాటిపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారు. గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పౌరులకూ ఫోటోలు అప్లోడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
అంతా బాగుండాలి - సీఎం జగన్
మున్సిపల్ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాల్లో తీసుకువస్తున్న యాప్ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా.. ఇతర మౌలిక సదుపాయాలు నిర్వహణ బాగుండాలన్నారు. ఇప్పుడు తీసుకొస్తున్న యాప్ ద్వారా వచ్చే గ్రీవెన్స్ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలని స్పష్టం చేశారు. వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ అంశంపైనాకూడా దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. మున్సిపల్ సర్వీసులు పారదర్శకంగా ప్రజలకు అందాలని... టౌన్ ప్లానింగ్ సహా.. ఇతరత్రా విభాగాల్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ను పరిశీలన చేయాలని సూచించారు.
ప్రజలకు సత్వరంగా సేవలు అందడం, నిర్దేశిత సమయంలోగా అనుమతులు రావడం, అవినీతి లేకుండా చూడ్డమే లక్ష్యంగా మార్పులు తీసుకురావాలన్నారు ముఖ్యమంత్రి జగన్. సాఫ్ట్వేర్ అప్లికేషన్ల్పై నిశిత సమీక్ష చేసి తగిన ప్రణాళికను రూపొందించాలన్నారు. రాజమండ్రిలోనూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలో పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్, ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.