CM Jagan On Ambedkar Statue : శాశ్వతమైన ప్రాజెక్టు.. పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలి
Ambedkar Memorial Statue Project: అంబేడ్క ర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్షించారు. ప్రాజెక్ట్ పనులు అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. పనుల పురోగతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
CM Jagan Review on Ambedkar Memorial Statue Project: విజయవాడ స్వరాజ్ మైదానంలో తలపెట్టిన అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సమీక్షించారు సీఎం జగన్. పనుల పురోగతిపై అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. సివిల్ వర్క్స్, సుందరీకరణ పనులపై కూడా సీఎం సమీక్షించారు.స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అన్ని స్లాబ్ వర్కులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయని చెప్పారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా వస్తుందని ముఖ్యమంత్రికి తెలిపారు. విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు... ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పుకొచ్చారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను సీఎంకు క్లుప్తంగా వివరించారు.
సీఎం ఏమన్నారంటే..
అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు అని చెప్పారు ముఖ్యమంత్రి జగన్. " పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలి. విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలి. స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్ సెంటర్ కూడా అత్యంత ప్రధానమైనది. నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి" అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈప్రాజెక్ట్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి పలు దఫాలుగా సమీక్షించిన సంగతి కూడా తెలిసిందే. ఏప్రిల్ 14 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 80 అడుగుల పీఠంపై 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా భూమి నుండి విగ్రహం ఎత్తు మొత్తం 205 అడుగులు ఉంటుంది.
సంబంధిత కథనం