రేపు శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం.. వేట విరామంలో ఆర్థిక సాయం-cm to launch dbt scheme in srikakulam tomorrow to serve fishermen ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రేపు శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం.. వేట విరామంలో ఆర్థిక సాయం

రేపు శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం.. వేట విరామంలో ఆర్థిక సాయం

Sarath Chandra.B HT Telugu

ఏపీలో మత్స్యకారులకు వేట విరామ సమయంలో అండగా నిలిచేందుకు మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళంలో ప్రారంభించనున్నారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 చొప్పున 1,29,178 కుటుంబాలకు రూ. 258 కోట్ల లబ్ది చేకూరుస్తారు.

రేపు శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

ఏపీలో మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం శనివారం ప్రారంభించనుంది. మత్స్యకారులను ఆర్ధికంగా ఆదుకునేలా ‘మత్స్యకారుల సేవలో...’ పేరుతో సాయం అందించనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

శనివారం శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘మత్స్యకారుల సేవలో...’ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో 12 తీర ప్రాంత జిల్లాల్లో సముద్రం వేటపై జీవిస్తున్న 1,29,178 కుటుంబాలకు ఆర్ధికంగా రూ. 258 కోట్ల ప్రయోజనం కలుగుతుంది. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు, ఆక్వారంగానికి ఎప్పుడూ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని ఈ పథకాన్ని తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా నిజం చేసింది.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంది

వేట విరామ సమయంలో గత ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10,000 మాత్రమే ఇచ్చిందని టీడీపీ సర్కారుచెబుతోంది. ఎన్నికల ఏడాదిలో అది కూడా ఇవ్వలేదని 2 నెలల పాటు సముద్రంలో వేటకు వెళ్లకుండా, విరామం ఇవ్వడంతో మత్స్యకార కుటుంబాలకు ఆర్ధికంగా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుందని అర్థం చేసుకుని ఎన్నికలకు ముందే మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచుతామని ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టోలో చెప్పింది. మాట ఇచ్చినట్టుగానే... నేడు దానిని నెరవేర్చింది.

మత్స్యకారులకు ఆర్ధిక సాయం ప్రవేశ పెట్టింది చంద్రబాబే

రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు తొలిసారిగా భృతిని ప్రవేశ పెట్టింది. 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాకుండా వలలు, పడవలు, ఐస్ బాక్సులు అదనంగా ఇచ్చింది. మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేకంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6 రెసిడెన్షియల్ పాఠశాలు ఏర్పాటు చేసింది.

10 నెలల పాలనలో మరింత సాయం

2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆక్వారంగం అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చింది. స్వర్ణాంధ్ర-2047 విజన్‌ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆక్వారంగాన్ని గ్రోత్ ఇంజిన్‌గా ఎంచుకుంది. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు ఇస్తోంది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న మత్స్యకారులు... చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తోంది. ఇప్పటికే గతేడాది చనిపోయిన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు సాయం అందించింది. మరో 80 కుటుంబాలకు త్వరలోనే సాయం చేయనుంది. ఈ ఏడాది ఇందుకోసం రూ.8 కోట్లు కేటాయించింది.

డీజిల్‌పై రూ.9 సబ్సిడీ

వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తోంది. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు డీజిల్‌పై సబ్సిడీ అందిస్తోంది. ఈ ఏడాది అర్హత ఉన్న 23,062 బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు కేటాయించింది. మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళ్తున్న మత్స్య సోదరుల రక్షణ కోసం 3 నెలల్లో 4,484 బోట్లలో టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థ తీసుకురానుంది. సాగర్‌మాల పథకం కింద రూ.97 కోట్లతో పులికాట్‌ సరస్సు దగ్గర చేపట్టే ప్రాజెక్టుతో ఆ ప్రాంతంలోని 20 వేల మత్య్సకార కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

కొత్తగా 9 ఫిషింగ్ హార్బర్లు.. 7 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు..

రూ.1,961 కోట్లతో కొత్తగా 9 ఫిషింగ్ హార్బర్లను రెండు దశల్లో రాష్ట్రంలో నిర్మిస్తోంది. అలాగే, వీటికి అదనంగా రూ.199 కోట్లతో 7 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా సిద్ధం చేస్తోంది. మత్స్యకార కుటుంబాలకు ఉపకరించేలా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఆక్వాపార్క్‌ను రూ.88 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆక్వాకల్చర్‌కు యూనిట్ విద్యుత్‌కు రూ.1.50 కే సరఫరా చేస్తోంది. 68,134 సర్వీస్ కనెక్షన్లకు రూ.1,187 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు మత్స్యకారుల సంక్షేమం కోసం చేపడుతోంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం