YS Jagan In Kurnool: బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీలో జాప్యంపై కంగారొద్దన్న సిఎం, కోడ్ నేపథ్యంలో ముందే కార్యక్రమాల నిర్వహణ
YS Jagan In Kurnool: బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీలో జాప్యానికి కంగారు పడొద్దని సిఎం జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముందే పథకాలను ప్రారంభిస్తున్నట్టు స్పష్టత ఇచ్చారు.
YS Jagan In Kurnool: మహిళలకు ఆర్ధిక సాధికారత కోసం చేపట్టి నగదు బదిలీ పథకాలు లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు చేరడంలో జరుగుతున్నDelay జాప్యంపై సిఎం జగన్ స్పష్టత ఇచ్చారు. కర్నూలు జరిగిన వైఎస్సార్ EBC Nestham ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా బ్యాంకు ఖాతాల్లో నిధుల జమ కావడానికి సమయం పడుతుందని, ఆందోళన చెందొద్దని సూచించారు.

దేశ వ్యాప్తంగా మరో మూడు నాలుగు రోజుల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని, అందుకే సంక్షేమ పథకాల నగదు బదిలీపై ముందే బటన్ నొక్కుతున్నానని సిఎం జగన్ కర్నూలులో చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో డబ్బులు అందరి ఖాతాల్లో జమ అవుతాయని, రెండు వారాల్లోగా అందరి ఖాతాల్లో డబ్బులు పడతాయని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని సిఎం ప్రకటించారు.
గత వారం ముఖ్యమంత్రి విడుదల చేసిన చేయూత నిధులు బ్యాంకు ఖాతాలకు జమ కాకపోవడంతో మహిళలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ వివరణ ఇచ్చారు.
రెండు వారాల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికలు చదవొద్దని, టీవీలు చూడొద్దని, నగదు బదిలీ పథకాల్లో లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలలో ఆటోమెటిక్గా డబ్బులు పడతాయి, కంగారు పడొద్దని సూచించారు.
డబ్బులిస్తే తీసుకోండి…వైసీపీకి ఓటేయండి…
ఎన్నికల్లో ఎవరు డబ్బులిచ్చినా తీసుకోవాలని, ఓటు వేసేపుడు మాత్రం పొరపాటు చేయొద్దని సిఎం జగన్ సూచించారు. బనగానపల్లిలో రామిరెడ్డికి ఓటు వేస్తేనే జగన్ సిఎం అవుతాడని గుర్తుంచుకోవాలన్నారు.
ఏదైనా పొరపాటు జరిగితే తర్వాత నేరుగా డబ్బులు రావని, జన్మభూమి కమిటీలు, వివక్ష మొదలవుతుందని హెచ్చరించారు. పేదల బతుకులు, పేద పిల్లల చదువులు ఆవిరైపోతాయని, పేదల భవిష్యత్తు అంధకారమై పోతుందన్నారు. అందరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
వైఎస్సార్ ఈబీసీ నేస్త, వైఎస్సార్ కాపునేస్తం తమ మ్యానిఫెస్టోలో లేకపోయిన వారికి తోడుగా ఉండాలని, పేదరికం వల్ల ఇబ్బందులు పడకూడదని అడుగులు వేసినట్టు చెప్పారు. పేదరికానికి కులం ఉండదని అందరిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పథకాలు ప్రారంభించినట్టు చెప్పారు.
ఈబీసీ నేస్తంలో 4,19,583 మంది మహిళలకు 629కోట్ల రుపాయల్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు చెప్పారు. మూడో విడత జమ చేసే సొమ్ముతో కలిపి మూడు విడతల్లో 4,95,269మంది మహిళలకు రూ.18,770కోట్ల రుపాయల్ని అందచేసినట్టు చెప్పారు.
ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఈ ఏడాది మరో 65,618 మందికి లబ్ది కలిగిందన్నారు. ఇప్పటికే 1, 07,818 మంది రెండు సార్లు ఈబీసీ నేస్తం నిధులు అందుకున్నారని, 3,21,827మంది మూడుసార్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం అందుకున్నారని సిఎం జగన్ చెప్పారు.
మహిళలు ఏదైనా వ్యాపారం చేసుకుని కుటుంబాలకు అండగా నిలవొచ్చని, రూ.6-10వేల వరకు నెలనెలా సంపాదించు కోగలుగుతున్నారన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ మహిళకు, కాపునేస్తం ద్వారా కాపు మహిళలకు, ఈబీసీ నేస్తం ద్వారా ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు సాయం చేస్తున్నట్టు చెప్పారు.
చేయూత ద్వారా 33.18లక్షల మంది మహిళలకు, కాపునేస్తంలో 4.64లక్షల మందికి లబ్ది కలిగిందన్నారు. ఈబీసీ నేస్తంలో 4.94లక్షల మందితో కలిపి రాష్ట్రంలో 45-60 ఏళ్ల మధ్య వయసున్న 62.74లక్షల మంది మహిళలకు 58 నెలల్లో ఆర్దికంగా సాయం చేసినట్టు చెప్పారు.
చంద్రబాబు హయంలో శూన్యం…
చంద్రబాబు హయంలో మహిళలకు ఒక్కరుపాయైన బ్యాంకు అకౌంట్లలో జమ చేశాడా అని జగన్ ప్రశ్నించారు. ఐదేళ్లలో బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఎన్నిలక్షల రుపాయలు నేరుగా ఖాతాల్లో జమయ్యాయో చూడాలన్నారు.
గతంలో ఏ పథకం ఏందో ఎవరికి తెలీదని, ఎప్పుడిస్తారో తెలీదని, ఇప్పడు గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని పథకాలను పక్కాగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి సచివాలయంలో ఇంటి వద్దకే వచ్చి ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.ఐదేళ్లలో నగదు బదిలీ ద్వారా రూ. 2.70లక్షల కోట్లలో మహిళలకే రూ.1.89 లక్షల కోట్లు నేరుగా బదిలీ చేసినట్టు చెప్పారు.
చంద్రబాబు మోసాలు…
ప్రతిపక్షంలో చంద్రబాబు దత్తపుత్రుడి పేరు చెబితే మహిళలకు ఏమి గుర్తుకు వస్తుందన్నారు. చంద్రబాబు పేరు చెబితే 14ఏళ్లు సిఎంగా పనిచేసి, మూడు సార్లు సిఎం అయిన వ్యక్తి పేరు చెబితే మహిళలకు ఆయన చేసిన వంచనలు, చంద్రబాబు దగా మాత్రమే గుర్తుకు వస్తాయన్నారు. చంద్రబాబు చేసిన ఒక్క మంచి కూడా ప్రజలకు గుర్తుకు రాదన్నారు.
దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే మోసగాడు, ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్టు భార్యల్ని మార్చే మ్యారేజీ స్టార్, వంచకుడు గుర్తుకు వస్తాడన్నారు.ఒకరికి విశ్వసనీయత, ఇంకొకరికి విలువలు లేవని, విశ్వసనీయత, విలువలు లేని వారు మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి తనై యుద్ధానికి వస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ హామీలు ఏమయ్యాయి….
ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చారని, ముగ్గురు ఒక్కటై ఒకే వేదికపై కూర్చుని, మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టో అంటూ చంద్రబాబు సంతకంతో ప్రతి ఇంటికి మ్యానిఫెస్టో పంపారన్నారు.
రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం, 87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టాడని, 14,205కోట్ల పొదుపు సంఘాల రుణాల రద్దు చేస్తానని మోసం చేశాడని, మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కాల్ మనీ సెక్స్ రాకెట్లు నిర్వహించారని, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పథకంలో రూ.25వేల ఖాతాల్లో వేస్తారని చెప్పారని, ఒక్కరికైనా బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేశారా అని ప్రశ్నించారు.
2014 మ్యానిఫెస్టోలో చంద్రబాబు 16,17 పేజీల్ని మహిళలకు కేటాయించారని , మహిళలకే 9 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మద్యం బెల్టు షాపుల రద్దుపై రెండో సంతకం చేస్తానని ప్రకటించారు. పొదుపు సంఘాలకు రుణమాఫీ, మహాలక్ష్మీ పేరుతో ఆడబిడ్డలకు రూ.25వేల డిపాజిట్, పండంటి బిడ్డ పేరుతో పేద మహిళలకు రూ.10వేలు, ఏటా కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు, ఏడాదికి రూ.1200, ఐదేళ్లలలో రూ.6వేల సబ్సిడీ ఇస్తామన్నారని, హైస్కూళ్లలో విద్యార్ధులకు సైకిళ్ల పంపిణీ, కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు రుణాలు, మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ హామీలిచ్చారని గుర్తు చేశారు. 2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ ఎందుకు ఆ హామీలు నెరవేర్చలేదని నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో రంగురంగుల మ్యానిఫెస్టోలతో మోసం చేసేందుకు చంద్రబాబు దత్తపుత్రుడు సిద్ధం అవుతున్నారని మండిపడ్డారు. ప్రతి ఇంట్లో జరిగిన మంచిని మాత్రమే కొలమానం తీసుకోవాలన్నారు. మోసం చేసేవారికి, అబద్దాలు చెప్పే వారికి గట్టి గుణపాఠం చెప్పే బాధ్యత మహిళలు తీసుకోవాలన్నారు. ఓటు అనే దివ్యాస్త్రంతో గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు.
సంబంధిత కథనం