CM Jagan On Lands : భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు ఉండాలి-cm jagan review on jagananna permanent land rights and land protection ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Jagan Review On Jagananna Permanent Land Rights And Land Protection

CM Jagan On Lands : భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు ఉండాలి

HT Telugu Desk HT Telugu
Oct 18, 2022 04:39 PM IST

Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Scheme : భూముల రీసర్వేలో నాణ్యత అనేది చాలా ముఖ్యమని సీఎం జగన్ అన్నారు. ఒక గ్రామంలో రీసర్వే చేసిన తర్వాత అన్నిరకాలుగా ఈ ప్రక్రియను ముగించాలన్నారు. ఆ గ్రామంలో మనదైన ముద్ర కనిపించాలని స్పష్టం చేశారు.

సీఎం జగన్
సీఎం జగన్

వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం(Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Scheme) పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీచేశారు. రీసర్వేలో నాణ్యత అనేది చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక గ్రామంలో రీసర్వే చేసిన తర్వాత అన్నిరకాలుగా ఈ ప్రక్రియను ముగించాలన్నారు. ఆ గ్రామంలో మనదైన ముద్ర కనిపించాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

'భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి. రీసర్వే(Resurvey) పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం. వాటి ఫలాలు ప్రజలకు అందాలి. క్వాలిటీ అనేది కచ్చితంగా ఉండాలి. ఎక్కడా కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాట రాకూడదు. మొబైల్‌ ట్రిబ్యునళ్లు, సరిహద్దులు, సబ్‌డివిజన్లు.. ఇవన్నీకూడా చాలా క్రమ పద్ధతిలో ముందుకు సాగాలి. రీ సర్వే చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన సమస్యలను అత్యంత ప్రణాళికా బద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలి.' అని సీఎం జగన్(CM Jagan) అన్నారు.

ఈ సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుందని సీఎం జగన్ అన్నారు. రికార్డులు, డేటా అంతా కూడా స్వచ్ఛీకరణ జరుగుతుందని చెప్పారు. ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని సూచించారు. రీ సర్వే ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కారణంతో చాలామంది ఈ కార్యక్రమంపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ చెప్పారు.

ఈ గొప్ప ప్రయత్నాన్ని నీరుగార్చి, ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని సీఎం జగన్ అన్నారు. 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నామని, దీనికోసం కొన్ని వేలమందిని రిక్రూట్‌ చేసుకున్నామన్నారు. అత్యాధునిక పరికరాలను కోట్లాది రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేశామన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవ్వరూ కూడా వేలెత్తి చూపని విధంగా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.

'దోషాలతో, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదు. సంబంధిత గ్రామ సచివాలయంలో సర్వే పూర్తికాగానే అక్కడ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం కూడా ఏర్పాటయ్యేలా చూడాలి. సర్వే పూర్తైన తర్వాత ప్రతి గ్రామంలో 5శాతం రికార్డులను ఆర్డీఓలు, 1 శాతం జేసీలు హక్కు పత్రాలను వెరిఫికేషన్‌ చేయాలి. పై అధికారులు గ్రామాల్లో సందర్శించడం వల్ల అందరూ కూడా బాధ్యతాయుతంగా తమ పనులు నిర్వర్తిస్తారు. అలాగే సిబ్బందిలో జవాబుదారీతనం కూడా వస్తుంది.' అని సీఎం జగన్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మార్గదర్శకాలు రూపొందించుకుంటామని అధికారులు చెప్పారు. తప్పులు, పొరపాట్లు లేని విధంగా హక్కు పత్రాలు జారీచేస్తామన్నారు. భూ సర్వే ప్రక్రియలో ఏ దశలో అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ సర్వే పూర్తిచేయడం ద్వారా భూ యజమానుల హక్కులను తరతరాలపాటు కాపాడుగలుగుతామన్నారు. ఆక్రమణలు, కబ్జాలు, రికార్డుల్లో అవకతవకలు ఇలాంటి వాటికి పూర్తిస్థాయిలో చెక్‌ పడుతుందని అధికారులు చెప్పారు.

'ఇప్పటివరకూ 6,037 గ్రామాల్లో డ్రోన్లను ఎగరవేశాం. ఇందులో 1,545 గ్రామాల్లో రెవిన్యూ రికార్డులు కూడా ఖరారయ్యాయి. ప్రతినెలా 13,335 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని సర్వే చేస్తున్నాం. డ్రోన్లు ఎగురవేయడానికి అనువుగాలేని ప్రాంతాల్లో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సర్వే చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. నవంబర్‌ మొదటివారంలో తొలివిడత గ్రామాల్లో హక్కుపత్రాలను అందిస్తాం.' అని అధికారులు తెలిపారు.

IPL_Entry_Point