Cm Polavaram Review: పోలవరంలో చిన్న సమస్యల్ని భూతద్దాల్లో చూపిస్తున్నారన్న సిఎం జగన్
Cm Polavaram Review: భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో చిన్నచిన్న సమస్యలు తలెత్తడం సహజమని, గైడ్ వాల్ కూలిపోవడాన్ని భారీ విపత్తుగా చూపించి హడావుడి చేస్తున్నారని ఏపీ సిఎం జగన్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
Cm Polavaram Review: పోలవరం స్పిల్వే అప్రోచ్ ఛానల్ వెంబడి నిర్మించిన గైడ్వాల్ కుంగిపోవడం చిన్న సమస్య అని దానిని పెద్ద విపత్తు మాదిరిగా చూపిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. గైడ్ వాల్పై సమీక్షా సమావేవంలో ప్రస్తావనకు వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
గైడ్వాల్ డిజైన్లన్నీ కేంద్ర జలసంఘం, సీడబ్ల్యూసీ ఖరారుచేసిందని, వారి ఆమోదంతోనే పనులు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం వచ్చిన సమస్యను కూడా వారికి నివేదించామని తెలిపారు. దీన్ని సరి దిద్దడం పెద్ద సమస్యకాదని, సీడబ్ల్యూసీ పరిశీలన కాగానే వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని అధికారులు వివరించారు.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంతో పాటు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న పనులను సమగ్రంగా పరిశీలించారు.
గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును ఏపీ ప్రభుత్వం పెంచింది. కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపును కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ఇటీవల నిర్మాణం పూర్తిచేసుకున్న దిగువ కాఫర్ డ్యాంను సీఎం పరిశీలించారు.
గత ప్రభుత్వంలో ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రంవాల్ ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. డయాఫ్రం వాల్ ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇసుకను నింపే పనులను పరిశీలించారు. వైబ్రో కాంపాక్షన్ ద్వారా నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షించారు.
డయాఫ్రం వాల్ ప్రాంతంలో పునర్ నిర్మాణాలు, ఆతర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణలపై అధికారులతో చర్చించారు. తర్వాత ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పోలవరం తొలిదశ పూర్తికి నిధుల విడుదలపై కేంద్రం అంగీకారం…
పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పోలవరం నిర్మాణం కోసం రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మెమోరాండం జారీచేసిందని, దీన్ని కేంద్ర జల శాఖకు లేఖద్వారా తెలిపిందని అధికారులు సిఎంకు వివరించారు.
గత ప్రభుత్వం ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతంలో నిర్మాణాలకోసం అదనంగా రూ.2వేల కోట్లు ఇందులో భాగంగా ఇచ్చిందని అధికారులు సిఎంకు వివరించారు.
పోలవరం నిర్మాణంలో కాంపౌండ్ వారీగా బిల్లుల చెల్లింపు వల్ల ప్రాజెక్టు నిర్మాణాలు ఆలస్యం అవుతున్న విషయాన్నిపరిగణలోకి తీసుకుని దానికి కేంద్ర మినహాయింపులు కూడా ఇచ్చిందని అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరాయంగా సంప్రదింపులు, చర్చలు జరిపి, ప్రత్యేక దృష్టిపెట్టడంతోనే ఇది సాధ్యమైందని అధికారులు సిఎంకు తెలిపారు.
చిన్నచిన్న సమస్యలు సహజమే…
భారీ ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయని అధికారులకు సీఎం జగన్ భరోసానిచ్చారు. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా రాష్ట్రంలో ఉందన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారని, ఖాళీల నుంచి వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు.
ఈఎస్ఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్ దారుణంగా దెబ్బతిందని, దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడంతో పాటు రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఇది మాత్రం మీడియాకు కనిపించలేదని సిఎం విమర్శించారు.
గతంలో రామోజీరావు బంధువులకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించేశారని, ప్రాజెక్టు స్ట్రక్చర్తో ఏమాత్రం సంబంధం లేనిది గైడ్వాల్ అన్నారు. ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులాగ చూపించే ప్రయత్నం చేస్తున్నారని, దీన్నికూడా పాజిటివ్గా తీసుకుని తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులకు సూచించారు.
డిసెంబర్ కల్లా కీలక నిర్మాణం పూర్తి….
కీలక పనుల్లో గణనీయ ప్రగతి సాధించామని, పోలవరం ప్రాజెక్టులో కీలక పనుల్లో ప్రగతిని అధికారులు వివరించారు. స్పిల్వే కాంక్రీట్ పూర్తయ్యిందని, 48 రేడియల్ గేట్లు పూర్తిస్థాయిలో పెట్టారని, రివర్ స్లూయిస్ గేట్లు పూర్తయ్యాయని, ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం పూర్తయ్యిందని తెలిపారు.
గ్యాప్ -3 వద్ద కాంక్రీట్ డ్యాం పూర్తయ్యిందని వివరించారు. పవర్హౌస్లో సొరంగాల తవ్వకం పూర్తయ్యిందని, అప్రోచ్ ఛానల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని, ఈసీఆర్ఎఫ్ డ్యాంలో దెబ్బతిన్న గ్యాప్-1 ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం పూర్తయ్యిందని, ఆప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్కూడా పూర్తయ్యిందని తెలిపారు.
ఈసీఆర్ఫ్ గ్యాప్-2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100శాతం ఇసుక రవాణా పూర్తయ్యిందని, వాటిని నింపే పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని తెలిపారు. మరోవైపు డయాఫ్రం వాల్ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇది పూర్తైతే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని అధికారులు తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. పునరావాస కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కాలనీలు ఓవైపు పూర్తవుతున్న కొద్ది సమాంతరంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. షెడ్యూలు ప్రకారం…, నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలని సిఎం అధికారులకు సూచించారు. .
టూరిస్ట్ స్పాట్గా పోలవరం….
పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దాలని సిఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలన్నారు. పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ కూడా నిర్మించాలన్నారు. మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు.