CBN In Davos WEF: ఆశావాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. విరామం లేకుండా రెండో రోజూ సమావేశాలు
CBN In Davos WEF: ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రెండో రోజు చంద్రబాబు పలు అంతర్జాతీయ సంస్థలతో సమావేశమయ్యారు.
CBN In Davos WEF: ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్కు చెందిన మార్స్క్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచ రవాణా రంగంలో రారాజులా వున్న మార్స్క్ రాష్ట్రానికి వస్తే సముద్రరవాణాలో ఏపీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుంది.
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సు రెండో రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్తో కీలక చర్చలు జరిపారు. వెయ్యి కిలోమీటర్ల పైనే తీరప్రాంతం కలిగి వుండటం, విస్తారంగా పోర్టులు ఉండటం... ఆంధ్రప్రదేశ్ బలమని, మానవ వనరులకు లోటు లేదని... విన్సెంట్ క్లర్క్కు ముఖ్యమంత్రి తెలిపారు.
మార్స్క్ రాష్ట్రానికి వస్తే కలిగే లాభాలు..
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఉత్పత్తులు, వాణిజ్య వస్తువులు సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడంలో మార్స్క్ కు తిరుగులేదు. మార్స్క్ ఏపీకి వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. రాష్ట్రంలోని ఓడరేవులు, ప్రధానంగా విశాఖపట్నం పోర్టు మరింత అభివృద్ధి చెందుతాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లకు రవాణా హబ్గా ఏపీ మారే అవకాశం ఉంటుంది. అటు ఎగుమతులు, దిగుమతుల రంగం బలపడుతుంది. ఏపీ ఒక గ్లోబల్ లాజిస్టిక్ హబ్గా ఎదగడమే కాకుండా, భారతదేశ ఆర్థిక వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేందుకు దోహదపడుతుంది.
పెట్టుబడుల కోసం ‘సిస్కో’కు ఆహ్వానం:
ఈథర్నెట్, ఆప్టికల్, వైర్లెస్, మొబిలిటీ వంటి నెట్వర్కింగ్లో సాంకేతికతలను అందించడం, డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. టెక్నాలజీ ఇన్నోవేషన్లో గ్లోబల్ లీడర్గా వున్న సిస్కో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చుక్ రాబిన్స్ దగ్గర ముఖ్యమంత్రి తన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవోతో భేటీ:
దావోస్లో ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్కు రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. ఎల్జీ కెమ్ దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ, 1.5 బిలియన్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో వున్న ఎల్జీ కెమ్ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ భేటీలో కోరారు.
పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట - విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు వున్న అవకాశాలను పరిశీలించమని సూచించారు. రాష్ట్రంలో తయారీకి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగంగా ప్లాంట్ ఏర్పాటయ్యేలా పూర్తి మద్దతిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
కార్ల్స్బెర్గ్ గ్రూప్ సీఈవోతో చర్చలు:
పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని చెప్పారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్లోని రైతులతో భాగస్వామి కావాల్సిందిగా కోరారు.
ఆర్సెల్లార్ మిట్టల్ ప్రాజెక్టుపైనా చర్చ:
అనకాపల్లిలో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై ఆర్సెలార్ మిట్టల్/నిప్పన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్. మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఈ బృహత్తర గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇటీవలి కాలంలో రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది. అలాగే వెల్స్పన్ చైర్మన్ బీకే గోయింకాతో కూడా పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.
అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ :
భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలోని గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ (GLC) దోహదపడుతుందని చంద్రబాబు వివరించారు. నాయకత్వ వికాసాన్ని పెంపొందించడానికి స్విట్జర్లాండ్కు చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్, జీఎల్సీ మధ్య అవగాహన కలిగిందన్నారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, దైనందిన జీవితాన్ని మెరుగుపరచడానికి ఏఐ, రియల్ టైమ్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని చంద్రబాబు వివరించారు.
గ్రీన్ ఎనర్జీ-గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ :
రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు గ్లోబల్ హబ్గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఇంధన సంస్కరణలు కూడా సుస్థిర అభివృద్ధికి ఒక ఉదాహరణగా తెలిపారు. 1999లో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో సాహసోపేతమైన విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయం సాధించనని గుర్తు చేశారు.
మిషన్ మోడ్లో క్లీన్ ఎనర్జీ పాలసీ అమలు :
సుస్థిర లక్ష్యాలను సాధించేందుకు మిషన్-మోడ్ విధానంతో ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చాలనేది తన ఉద్దేశంగా ముఖ్యమంత్రి చెప్పారు. 2030 నాటికి 500 MW పునరుత్పాదక విద్యుత్ను, 500 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇంధన రంగంలో 115 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ఆకర్షించామని, ఇది జాతీయ లక్ష్యంలో 30 శాతంగా చెప్పారు.
పారిశ్రామికవేత్తలకు మద్దతు:
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తమ విధానమని, పారిశ్రామిక వేత్తలకు, ఇంధన వ్యయాలను మరింత తగ్గించేలా నిరంతర పరిశోధనలు - అభివృద్ధికి తమ మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తన ప్రసంగంలో 1995 నుంచి నేటి దాకా సీఐఐతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. అలాగే... పేదరికం, సమాజంలో అసమానతలను రూపుమాపడానికి కార్పొరేట్ సంస్థలు, అధిపతులు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి దావోస్లో పిలుపునిచ్చారు.