దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29 శాతం ఏపీ నుంచే ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్య్సకార కుటుంబాలతో సీఎం భేటీ అయ్యారు. సముద్రతీరంలో మత్య్సకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మీతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. కమ్యూనిటీ హాల్కు చేరుకున్న సీఎం...చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకునే ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించారు.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం వెన్నంటేఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏపీలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. మొత్తం రూ.259 కోట్లు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
హైదరాబాద్, దిల్లీ ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్మీలో ఎక్కువగా పనిచేసేవాళ్లు కూడా శ్రీకాకుళం వాసులే అన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదే అన్నారు. ఇక్కడి వారికి తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదన్నారు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశానన్నారు.
"నేనూ బటన్ నొక్కవచ్చు. కానీ మీ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చాను. ప్రజల ఆదాయం పెంచేందుకు, వారి ప్రజల జీవనప్రమాణాలను మెరుగుపరిచేందుకు వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. గత ప్రభుత్వంలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ డబ్బులు ఏం చేశారో లెక్కలు లేవు. ఎర్రన్నాయుడు ఉద్దానం ప్రాంతానికి నీళ్లు సాధించారు. ఎంపీ రామ్మోహన్ ఆధ్వర్యంలో భోగాపురం విమానాశ్రయం పూర్తికాబోతుంది" - సీఎం చంద్రబాబు
మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామని, ఎచ్చర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక ఉద్యోగాలు ఇక్కడి వారికే వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.
"సమాజంలో వెనుకబడిపోయిన వర్గాల్లో మత్స్యకారులు కూడా ఉన్నారు. సముద్రాన్నే నమ్ముకుని బ్రతుకుతున్నారు. 61 రోజులు వేట విరామం సమయంలో మత్స్యకారులను ఆదుకోవాలని 2014-15లో మత్స్యకార భరోసాను ఇచ్చాం. 1,29,178 కుటుంబాలకు రూ.20 వేలు చొప్పున మత్స్యకార భరోసాను ఈ యేడాది ఇచ్చాం" -సీఎం చంద్రబాబు
సంబంధిత కథనం