CBN In Delhi:రాష్ట్రంలోని పది కేసులు నమోదైతే అందులో 6 కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి వివరించారు. . భూ వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియలో సరైన తనిఖీ, నియంత్రణ లేకపోవడం వల్ల పెద్దఎత్తున ఆక్రమణలు జరిగాయని, ప్రైవేట్ భూములను కూడా 22ఏ కింద చేర్చారని వివరించారు.
బుధవారం ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలకు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై చర్చించారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో సమావేశమై పలు అంశాలను వివరించారు.
అమిత్ షాతో జరిగిన భేటీలో రాష్ట్రంలో గంజాయి రవాణాపై చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. గంజాయి సాగును సమర్థవంతంగా నియంత్రించేందుకు ఈగల్ దళాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించగా ఆయన ప్రశంసించినట్టు తెలిపారు. ఏపీ రాజకీయ పరిణామాలపై అమిత్ షాతో చర్చించానని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ ఎలా ముందుకెళ్లాలనే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు చెప్పారు.
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు అంశంపై చర్చ జరిగిందన్నారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారని, ఏపీ రూపొందించిన ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు త్వరగా ఆమోదించాలని కోరినట్టు చెప్పారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకు వస్తున్నట్టు తెలిపారు. రెండు బిల్లుల గురించి చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్తో చర్చించానని, గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల రుణాలు, బకాయిల భారం తమపై వేసిందని చెప్పారు. అయినా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధి రేటు ఎలా పుంజుకుంది అనే అంశాన్ని ప్రస్తావించారు. మొత్తంమ్మీద వృద్ధి 12.94 శాతం ఉంటే అందులో ఒక్క వ్యవసాయ రంగంలోనే 15.86 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు నివేదించారు. సేవా రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, రుణాలపై ఆధారపడకుండా సంపదను సృష్టించడానికి స్థిరంగా 15 శాతం వృద్ధి రేటును సాధించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
జలవనరుల నిర్వహణ చర్చల్లో మరో ముఖ్యమైన అంశం. నీటి వృధాను నివారించడానికి, రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు సాగునీటిని అందించడానికి నదుల అనుసంధానం యొక్క ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి కేంద్రమంత్రులకు వివరించారు. సమర్థవంతమైన నీటి పంపిణీని నిర్ధారించడం కోసం వంశధార, నాగావళ, గోదావరి, కృష్ణా పెన్నా నదులతో పాటు పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచర్లకు అనుసంధానించాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం వృధాగా పోతున్న 200 టీఎంసీల నీటిని వ్యవసాయం, తాగునీటి అవసరాలకు మళ్లించవచ్చని చెప్పారు.
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ పాలనలో తప్పిదాలను ఎత్తిచూపారు. మద్యం ఆదాయాన్ని 25 సంవత్సరాలుగా తాకట్టు పెట్టారని విమర్శించారు. దక్షిణ భారతదేశంలో వృద్ధుల శాతం పెరగడం సవాళుగా మారిందని, ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో యువత జనాభా పెరగడం ఆయా రాష్ట్రాలకు అనుకూల అంశమని... జనాభా ధోరణులపై ఆందోళనను వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ కంటే దీర్ఘకాలిక జనాభా నిర్వహణ అవసరమని అన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిన కుటుంబాలకు ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి సమర్థించారు. హిందీ కమ్యూనికేషన్ కోసం ఒక సాధనంగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న త్రిభాషా సూత్రానికి మద్దతు పలికారు.
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా ఉందని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్నామని చెప్పారు. ప్రజలు తమ వైపే ఉన్నారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. అభివృద్ధి సంక్షేమం తమ ప్రధాన ధ్యేయమని, సంపద సృష్టించలేని వారికి సంక్షేమం పేరుతో పంచే హక్కు లేదన్నారు.
సంబంధిత కథనం