AP Mlc Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్… పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం
AP Mlc Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

AP Mlc Elections: ఫిబ్రవరి 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు.
ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదేనని ప్రతి ప్రతి ఎన్నికలోనూ కూటమి విజయం సాధించాలన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని, ఓటర్లను చైతన్యపరచాలన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్తో కూటమికి ప్రజలు తీర్పు ఇచ్చారు. దీనికి కారణం ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అది కనిపించాలన్నారు.
ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతిరోజూ పని చేస్తున్నామని వ్యవస్థలను గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించామని పాలనలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చామని చంద్రబాబు నేతలకు వివరించారు.
బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారుల్లో నమ్మకం కల్పించామన్నారు. దాదాపు రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నామని దీని ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రమంతటా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి నెలా 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని, 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు.
గత ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్లో రూ.780 కోట్లు చెల్లించామని, ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నాం. విద్యావంతులైన మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఆదాయ మార్గాల కల్పనకు ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పారు.
ఇవన్నీ 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేపట్టిందని చేసిన మంచి కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎన్నికలకు ఇక 10 రోజులు మాత్రమే సమయం ఉందని మూడు పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో ఉండాలన్నారు.
అన్ని పార్టీల నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పని చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మెరుగ్గా ఉండాలని చంద్రబాబు సూచించారు.
సంబంధిత కథనం