నేడు అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన.. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న సీఎం-cm chandrababu naidu to visit anantapur today cm to inspect handreeniva project works ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నేడు అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన.. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న సీఎం

నేడు అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన.. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న సీఎం

Sarath Chandra.B HT Telugu

రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణ పనులు వేగవంతం చేసి,త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

నేడు ఉరవకొండలో పర్యటించినున్న సీఎం చంద్రబాబు

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటిస్తారు. ఉరవకొండలొోని చాయాపురంలో ప్రాజెక్టు పనులను సీఎం సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు.

హంద్రీనీవా ప్రాజెక్టును 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా పనులు చేపట్టినా... 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. వైసీపీ ఐదేళ్లలో HNSS ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేసింది. కాలువ విస్తరణ, లైనింగ్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదు.

రాయలసీమ ప్రాంతానికి ప్రాజెక్టు ద్వారా ఎంత ప్రయోజనమో తెలిసి కూడా పట్టించు కోలేదని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. సీమ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను త్వరలోనే సాకారం చేయాలని భావిస్తున్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ - వెడల్పు పనులకు ముఖ్యమంత్రి పరిపాలనా అనుమతులిచ్చి పనులు ప్రారంభించారు.

2025 జూన్ నాటికి ఫేజ్-I పూర్తయ్యేలా ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిలో భాగంగా కొద్దినెలలుగా పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.

2014 – 2019 మధ్య కాలంలో

2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల పాటు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. ప్రాజెక్టు సామర్ధ్యానికి తగ్గట్టు కాలువలు లేకపోవడంతో డిజైన్‌లో మార్పు చేసి HNSS మెయిన్ కాలువను వెడల్పు చేయాలని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు.

కాలువను వెడల్పు చేసే పనులు ఏప్రిల్ 2017లో చేపట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్, మడకశిర బ్రాంచ్ కాలువ పనులు 2016-17లో పూర్తయ్యాయి. కియా పరిశ్రమకు నాడు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచే నీరివ్వడం జరిగింది. చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లు 2018-19లో పూర్తయ్యాయి. 2019లో మొదటిసారిగా బ్రాంచ్‌ కెనాల్స్‌కు నీరు విడుదల చేశారు.

ఈ 5 నెలల్లో పనుల్లో పురోగతి

HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులకు పరిపాలనా అనుమతులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరు చేసింది. మొదట కాలువలకు లైనింగ్ లేకుండా నిర్మించడంతో గరిష్ట ప్రవాహం కేవలం 2,200 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. 3850 క్యూసెక్కుల సామర్థ్యం కలిగేలా... కాలువలను విస్తరించి, లైనింగ్ పనులు చేపట్టారు.

5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు జరిగాయి. వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. ఫేజ్-II కాలువల (పుంగనూరు,కుప్పం బ్రాంచ్‌లు) పనులు వేగంగా జరుగుతున్నాయి. పాడెర, మడకశిర, కుప్పం వంటి ప్రాంతాలకు నీరు చేరేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు.

మొత్తం రూ.3,873 కోట్లతో పనులు

హంద్రీనీవా ప్రాజెక్టులో ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు మొత్తం రూ.3,873 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఫేజ్-1 కింద రూ.696 కోట్లతోనూ, ఫేజ్-2 కింద రూ.1,256 కోట్లతో HNSS ప్రధాన కాలువ (Km 216 – Km 400), పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 0.00 – Km 75) పనులు చేపట్టారు.

పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 75 – Km 207) పనులను రూ.480 కోట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఇప్పటివరకు 15 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. రూ.197 కోట్లతో కుప్పం బ్రాంచ్ కాలువ పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించగా, ఇప్పటివరకు 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.

ఫేజ్ 2 పూర్తయితే మెయిన్ కెనాల్ నుంచి 2,520 క్యూసెక్కులు, పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి 840 క్యూసెక్కులు నీటి సరఫరాకు వీలవుతుంది. HNSS మెయిన్ కాలువకు సంబంధించి రూ.590 కోట్లతో 400 కి.మీ నుంచి 490 కి.మీ వరకు లైనింగ్ పనులకు, అలాగే రూ.291 కోట్లతో 490 కి.మీ నుంచి 554 కి.మీ వరకు లైనింగ్ పనులకు, నీవా కాలువకు సంబంధించి రూ.362 కోట్లతో 0 కి.మీ నుంచి 123 కి.మీ వరకు పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

HNSS ప్రాజెక్టు లక్ష్యం :

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితే మొదటి దశలో కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు... మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రెండో దశలో అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. మొత్తం 81 మండలాల్లో 33 లక్షల మందికి త్రాగు నీటి సరఫరాకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం