ఎరువులు పక్కదారి పట్టిస్తే లైసెన్సులు రద్దు చేయండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు-cm chandrababu naidu orders cancellation of licenses of those who misuse fertilizers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఎరువులు పక్కదారి పట్టిస్తే లైసెన్సులు రద్దు చేయండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఎరువులు పక్కదారి పట్టిస్తే లైసెన్సులు రద్దు చేయండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఎరువులు బ్లాక్ మార్కెట్టుకు తరలిపోకుండా విజిలెన్స్ నిఘా పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టిస్తే లైసెన్సులు రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిల్వలు చెక్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సీఎం చంద్రబాబు

ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సీఎం సమీక్షించారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత ఏ విధంగా ఉంది, సరఫరా ఎలా జరుగుతోందనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.

ఈ సందర్భంగా జిల్లాల్లో ఉన్న పరిస్థితిని అధికారులు వివరించారు. అవసరానికి తగ్గట్టుగానే ఎరువులు, యూరియాను అందుబాటులో ఉంచుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మార్క్ ఫెడ్ ద్వారా ఎంతమేర ఎరువులను సరఫరా చేస్తున్నారని చంద్రబాబు అడిగారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్ ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్క్ ఫెడ్ ద్వారా దాదాపు 70 శాతం మేర ఎరువులు రైతులకు సరఫరా అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ఆదేశించారు.

తనిఖీలు చేపట్టండి - సీఎం చంద్రబాబు

ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. భారీ స్థాయిలో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పాటు యూరియా, ఎరువుల స్టాక్ కూడా చెక్ చేయాలని విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని సూచించారు.

ఎరువులు, యూరియా సరఫరా విషయంలో జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం సూచించారు. పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలన్నారు. అదే సమయంలో ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తుంటే.. అలాంటి వారిని పసిగట్టి... తగు రీతిన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

స్థానిక అధికారులతో... జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు నిత్యం సమన్వయం చేసుకుంటూ పని చేయాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. పరిశ్రమలు, రవాణా, విజిలెన్స్, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు సమన్వయంతో రోజువారీ పరిశీలన బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్య వస్తే స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.

కేసులకు వెనుకాడొద్దు…

ఎరువులు బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తే కేసులు నమోదు చేయడానికి ఎక్కడా వెనుకాడొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ధరలు పెంచి ఎరువుల అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎరువులను పక్కదారి పట్టించారని నిర్ధారణైతే... సదరు డీలర్ల లైసెన్సులు కూడా రద్దు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ఎస్ పోర్టల్లో సమాచారం అప్డేట్ ఏ మేరకు అవుతుందని ఆరా తీసిన సీఎం...ఐఎంఎఫ్ఎస్ పోర్టల్ లో రియల్ టైమ్ ప్రాతిపదికన సమాచారం అప్డేట్ కావడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. సాకులు చెప్పకుండా.. పోర్టల్లో సమాచారం నిరంతరం అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

బయట ప్రైవేట్ డీలర్ల కంటే.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువుల సరఫరా ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. రిటైల్ కేంద్రాల వద్ద కానీ.. పీఏసీఎస్ ల వద్ద కానీ యూరియా, ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం