దిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ- పోలవరం బనకచర్ల ప్రాజెక్టు, ఆక్వా రంగ సమస్యలపై చర్చ-cm chandrababu meets union ministers discusses polavaram banakacharla project aqua sector issues ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  దిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ- పోలవరం బనకచర్ల ప్రాజెక్టు, ఆక్వా రంగ సమస్యలపై చర్చ

దిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ- పోలవరం బనకచర్ల ప్రాజెక్టు, ఆక్వా రంగ సమస్యలపై చర్చ

విదేశీ పర్యటన ముగించుకుని దిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు...నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు, ఆక్వా రంగం సమస్యలు, ఏపీలోని పలు కీలక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ సాయంపై కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు.

దిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ- పోలవరం బనకచర్ల ప్రాజెక్టు, ఆక్వా రంగ సమస్యలపై చర్చ

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రులతో మంగళవారం చర్చించారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి దిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు...నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.

ముందుగా కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ తో భేటీ అయిన చంద్రబాబు జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్ర నిధుల మంజూరుపై చర్చించారు. కేంద్ర పథకమైన జల్ జీవన్ మిషన్ ను రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి....ఈ పథకానికి నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు.

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై

అదే విధంగా రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపైనా కేంద్ర జలశక్తి మంత్రికి వివరించి...ఈ ప్రాజెక్టుకు సాయం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కలిగే ప్రయోజనాలు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. అదే విధంగా కేంద్ర అటల్ భూజల్ యోజన్ కార్యక్రమంపై భేటీలో చర్చించారు. భూగర్భ జలాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం...ఈ కార్యక్రమానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఆక్వా రంగం సమస్యలపై కేంద్రమంత్రితో చర్చ

అనంతరం న్యాయ శాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ అంశంపై ఆయనతో చర్చించారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ అమలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు...అమెరికా సుంకాల కారణంగా రాష్ట్రంలో ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. భారతదేశ సీ ఫుడ్స్ పై విధించిన 26 శాతం సుంకాలు ఏపీలోని ఆక్వా రంగానికి తీవ్ర నష్టం చేస్తున్నాయని సీఎం వివరించారు.

అమిత్ షాతో భేటీ

ఆక్వా సంక్షోభం విషయంలో అమెరికాతో చర్చించి ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. దీని కోసం తీసుకోవాల్సిన స్వల్ప కాలిక, మధ్యస్థ, దీర్ఘకాలిక చర్యల గురించి పలు ప్రతిపాదనలు సూచించారు. అనంతరం సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ భేటీలలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు పాల్గొన్నారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం