Tirumala Stampede : 'అసలు అంత మందిని ఎలా అనుమతించారు..?' టీటీడీ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్
CM Chandrababu On TTD : తిరుపతిలోని తొక్కిసలాట ఘటనను సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాటకు గల కారణాలను మంత్రులు, అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
తిరుమల తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చకోవాలని హెచ్చరించారు.
“అందరికీ చెబుతున్నాను.. పద్ధతి ప్రకారం పని చెయ్యడం నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు దాని ప్రకారం పని చేయాలి. తమాషా అనుకోవద్దు. 2000 మందే పడతారు అని తెలిసినప్పుడు 2500 మందిని ఎలా అనుమతించారు..? విధులు నిర్వర్తింతే అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి ఆదేశాలు ఇచ్చారో ఆ కాపీని నాకు ఇవ్వండి” అంటూ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు సమన్వయ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదిక వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు.
సీఎం చంద్రబాబు వేసిన పలు ప్రశ్నలకు టీటీడీ ఈవో శ్యామలరావు సమాధానాలు ఇచ్చారు. గతంలో లాగే ఇప్పుడూ కూడా ఏర్పాట్లు చేశామన్న ఈవో శ్యామల రావు చెప్పుకొచ్చారు. గతంలో మాదిరిగా కాదు.. కొత్తగా మనకంటూ ప్లాన్ ఉండాలి కదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను ప్రశ్నించారు. “అందరికీ చెప్తున్నా... పద్ధతి ప్రకారం పని చెయ్యడం నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు దాని ప్రకారం పని చేయాలి” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
బాధితులకు చంద్రబాబు పరామర్శ…
స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యసేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది. మరోవైపు తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పలువురు మంత్రులు పరామర్శించారు. క్షతగాత్రులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు.
సంబంధిత కథనం