వేదపండితులకు నిరుద్యోగ భృతి, రూ.53.91 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆనం-cm chandrababu birthday occasion minister anam distributed unemployment allowance cheques to vedic scholars ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  వేదపండితులకు నిరుద్యోగ భృతి, రూ.53.91 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆనం

వేదపండితులకు నిరుద్యోగ భృతి, రూ.53.91 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆనం

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హోమం చేయించారు. అనంతరం ఆగమ శాస్త్రం వేదపారాయణం చేసే 599 మంది పండితులకు రూ.53.91 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.

వేదపండితులకు నిరుద్యోగ భృతి, రూ.53.91 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆనం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు వేడుకలను టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అలాగే మంత్రులు సైతం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హోమం నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో ఆగమ శాస్త్రం చదివి వేదపారాయణం చేసే 599 మంది పండితులకు రూ.53.91 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. నెలకు రూ.3 వేల చొప్పున జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన నిరుద్యోగ భృతిని పండితులకు చెక్కుల రూపంలో అందించారు. హోమంలో పాల్గొన్న 8 వేల మందికి చీరలు, పంచెలు, తిరుమల లడ్డును మంత్రి ఆనం పంపిణీ చేశారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్బంగా ధాన్యంతో రైతులు చంద్రబాబు చిత్రాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

"ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబు సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.44 లక్షల విరాళం అందించారు. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు ఆయన రూ.44 లక్షల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు వడ్డించారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం