CBN In Kuppam: రాజముద్రతోనే పాస్ పుస్తకాలు జారీ చేస్తామని కుప్పంలో ప్రకటించిన సిఎం చంద్రబాబు
CBN In Kuppam: ఏపీలో ఇక రాజముద్రతోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి సొంత నియోజక వర్గం కుప్పంలో పర్యటించారు.
CBN In Kuppam: ఆంధ్రప్రదేశ్లో రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేసిన పాస్ పుస్తకాల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. నాలుగోసారి సిఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజక వర్గానికి వచ్చిన బాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఏపీలో పాసు పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి..రాజముద్ర వేస్తామని చంద్రబాబు కుప్పం సభలో ప్రకటించారు. ‘‘16,347 పోస్టుల భర్తీకి ఇచ్చిన మాట ప్రకారం సంతకం చేశాం...కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి పట్టాదారుపుస్తకాలపై బొమ్మలు ముద్రించుకున్నారని టైటిల్ రిజిస్ట్రేటర్ ను పెట్టుకుని భూములు దోచుకోవాలని చూశారని బాబు ఆరోపించారు.
అందుకే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. పాసుపుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి..రాజముద్ర వేసి పుస్తకాలు రైతులకు అందిస్తామన్నారు.
రాష్ట్రంలో పెన్షన్ ను కూడా రూ.4 వేలకు పెంచాం...మూడు నెలల బకాయి కలిపి జూలైలో రూ.7 వేలు ఇవ్వబోతున్నామని చెప్పారు. సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లను పంపిణీ చేస్తామన్నారు. అన్న క్యాంటీన్లు కూడా 183 ప్రారంభించబోతున్నామని వాటిని కూడా పెంచుకుంటూ పోతామన్నారు. స్కిల్ గణన కూడా చేపట్టి ఎవరికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలో చేస్తాం. సమైక్యరాష్ట్రంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాలు బలంగా తయారయ్యాయని చెప్పారు.
పసుపుకుంకుమ కింద ప్రతి డ్వాక్రా మహిళకు గతంలో రూ.10 వేలు అందించాం. వడ్డీలేని రుణాలు అందించాం. డ్వాక్రా సంఘాల మహిళలను లక్షాధికారులను చేస్తాం. డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం. సూపర్-6 కూడా అమలు చేస్తాం.’’ అని అన్నారు.
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి...అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం రూ.10 ఇచ్చి ప్రజల నుండి రూ.100 దోచిందని...తమ ప్రభుత్వం రూ.15 ఇచ్చి...రూ.100 సంపాదించే మార్గం చూపుతుందని అన్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం మొదటి రోజు శాంతిపురం మండలం, చిన్నారిదొడ్డి వద్ద హంద్రీనీవా సుజల శ్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించారు. అనంతరం కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
నామినేషన్ కు నేను రాకపోయినా మీరే నా తరపున వేశారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతానన్నారు. 164 మంది ఎమ్మెల్యేలతో కూటమి గెలిచింది....వైసీపీని చిత్తుగా ఓడించారని. ప్రజాస్వామ్యంలో విర్రవీగితే వైసీపీకి పట్టిన గతే ఎవరైనా పడుతుందన్నారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు 7 స్థానాలను ప్రజలు గెలిపించారు. 20 పార్లమెంట్లలో 7కు 7 స్థానాలు గెలివడం ఒక చరిత్ర అన్నారు. 21 పార్లమెంట్ స్థానాలు కూటమికి ఇచ్చారు. వైసీపీ ఒక అరాచక పార్టీ. దాన్ని ఇంటికి పంపడానికి టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుకట్టాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరిగరాయబోతున్నాం. నేను చేపట్టబోయే ఏ కార్యక్రమాన్ని అయినా ఇక్కడే ప్రయోగించి...ఆ తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తానని’’ సీఎం అన్నారు.
రాజధాని నిర్మాణానికి విరాళాలు
అమరావతి రాజధానికి పలువురు విరాళాలు అందించారు. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు విరాళాలకు సంబంధించిన చెక్కులను అందించారు. చిత్తూరు జిల్లా డ్వాక్రా సంఘాల తరపున రూ.4.5 కోట్లు, రామకుప్పంకు చెందిన టీడీపీ నేత ఆనందరెడ్డి రూ.5 లక్షలు, కుప్పంకు చెందిన ప్రేమ్ కుమార్ రూ.లక్షను విరాళంగా అందించారు. సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు అభినందించారు.