Compassionate Appointments : ఆ కుటుంబాలకు ఊరటినిచ్చిన సిఎం నిర్ణయం
Compassionate Appointments ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియమకాలను వర్తింప చేయాలని నిర్ణయించారు. ప్రొబేషన్ పూర్తి కాకున్నా మానవతా ధృక్పథంతో మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు.
Compassionate Appointments ప్రొబేషన్ డిక్లేర్ కాక ముందే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు కుటుంబాలకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఊరట నిచ్చారు. 2019 అక్టోబర్లో గ్రామ వార్డు సచివాలయ నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారిలో దాదాపు 200 మంది వరకు వివిధ కారణాలతో చనిపోయారు. ఉద్యోగాల్లో చేరిన వారికి రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకుంటే తప్ప వారికి కారుణ్య నియామకాల అర్హత లభించదు. 2019లో నియమితులైన వారికి గత జూన్లో ప్రొబేషన్ ఖరారైంది. ఈ నేపథ్యంలో కోవిడ్తో పాటు వివిధ రకాల కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఉద్యోగ సంఘగాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
ట్రెండింగ్ వార్తలు
కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడబోయి సచివాలయ ఉద్యోగులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ కాలేదు కాబట్టి సర్వీస్ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకాలకు అవకాశం లేకుండా పోయింది.
ఉద్యోగులు చనిపోవడంతో ఆ కుటుంబాలు వీధిన పడ్డాయని ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. గొప్ప మనసుతో సర్వీస్ నిబంధనలను సడలించి చనిపోయిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని సిఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై శనివారం సంతకం చేశారు. ఉద్యోగ నియమకాలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని ఉద్యోగ సంఘం నాయకులు చెబుతున్నారు.
మానవతా దృక్పథంతో ఆలోచించి చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.