10th Student Identifies Asteroid : గ్రహ శకలం కనుగొన్న పదో తరగతి విద్యార్థి
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన పదో తరగతి విద్యార్థి కుంచాల కైవల్యరెడ్డి అరుదైన రికార్డు సాధించింది. గ్రహ శకలం కనుగొన్నది.
kunchala Kyvalya Reddy : నిడదవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థిని కుంచాల కైవల్య రెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతోంది. నాసాతో భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ సెర్చ్ కోలాబరేషన్ (IASC) నుంచి మెయిన్-బెల్ట్ ఆస్టరాయిడ్ 2021 CM 37ని గుర్తించినందుకు సర్టిఫికేట్ పొందింది.
ట్రెండింగ్ వార్తలు
అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆస్టరాయిడ్ బెల్ట్లో గ్రహ శకలం 2021 సీఎం37ను కనుగొంది కైవల్య రెడ్డి. ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపెయిన్లో ఈ గ్రహశకలాన్ని కనిపెట్టింది.
పాన్స్టార్స్ టెలిస్కోప్ సాయంతో తీసిన అంతరిక్ష ఛాయా చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించి విశ్లేషించడం ద్వారా ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు కైవల్య పేర్కొంది. దిల్లీకి చెందిన స్వచ్ఛంధ సంస్థ స్పేస్పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సమీర్ సత్యదేవ్ వద్ద కైవల్యరెడ్డి శిక్షణ తీసుకుని ‘గామా’ టీం పేరు తో శకలాన్ని గుర్తించినట్టుగా పేర్కొంది.
గతంలో కైవల్య 2020 పీఎస్ 24 అనే మెయిన్ బెల్ట్లో ఉన్న గ్రహశకలాన్ని కనుగొంది. దీంతో సీఎం వైఎస్ జగన్ ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతి అందజేశారు. రెండో గ్రహశకలం కనుగొన్న కైవల్యని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి అభినందించారు.
జర్మనీ నిర్వహించిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక పోటీలో ఆమె ధృవీకరణ పత్రాన్ని కూడా అందుకుంది. 1 నిమిషం 38 సెకన్లలో ఆవర్తన పట్టిక పొడవైన రూపాన్ని అత్యంత వేగవంతమైన అమరికతో రికార్డును సృష్టించింది. అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్రవేశించింది.