క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల సంతాపం-christian pontiff pope francis passes away telugu states cms politicians mourn ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల సంతాపం

క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల సంతాపం

కేథలిక్ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం కేథలిక్ సమాజానికి తీరని లోటని తెలుగు రాష్ట్రాల సీఎంతో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు.

క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల సంతాపం

కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35 గంటలకు స్వర్గస్తులయ్యారు. పోప్ ఫ్రాన్సిన్స్ గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడ్డారు. 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన గత నెలలో డిశ్చార్జ్ అయ్యారు. ఆయన మరణాన్ని వాటికన్‌ వర్గాలు ధ్రువీకరించాయి. 2013లో పోప్‌ బెనిడెక్ట్‌ తర్వాత ఫ్రాన్సిస్‌ పోప్ బాధ్యతలు చేపట్టారు. పోప్ ఫ్రాన్సిస్‌ 1938లో దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ పదవిని అందుకొన్న తొలి వ్యక్తి ఆయనే.

ప్రముఖుల సంతాపం

పోప్ ఫ్రాన్సిస్ మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.

"తన వినయం, కరుణ, శాంతి సందేశం ద్వారా లక్షలాది మందిలో స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మిక నాయకుడు, పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఆశకు దీపంలా నిలిచిన ఆయన మానవాళిని ప్రేమ, దయతో నడిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ప్రపంచ కేథలిక్ సమాజానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను" - ఏపీ సీఎం చంద్రబాబు

"రోమన్ క్యాథలిక్ చర్చి హెడ్, వాటికన్ సిటీ అధిపతి…పోప్ ఫ్రాన్సిస్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మరణం ప్రపంచ మానవాళికి తీరని లోటు. సామాజిక న్యాయ సాధనలో, ప్రపంచ అసమానతలపై పోరాటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. పోప్ ఫ్రాన్సిస్ కుటుంబానికి, ప్రపంచ కేథలిక్ సమాజానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను" -తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

"ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్రైస్తవులకు ఆధ్యాత్మిక నాయకుడు, పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల నేను తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. ఆయన మార్గదర్శకత్వం, కరుణ, మానవత్వం పట్ల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రపంచ క్రైస్తవ సమాజానికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి"- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

"పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం నాకు తీవ్ర బాధను కలిగించింది. కరుణ, వినయం మరియు శాంతికి ప్రతీకగా నిలిచిన ఆయన, మానవత్వం మరియు ఆధ్యాత్మిక నాయకత్వం పట్ల తన అచంచల నిబద్ధతతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను స్పృశించారు. ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి" -మంత్రి నారా లోకేశ్

"పోప్ ఫ్రాన్సిస్ మరణం బాధాకరం. కేథలిక్ చర్చిలో పరివర్తన కలిగించే, ప్రభావవంతమైన అధిపతి - లాటిన్ అమెరికా నుంచి వచ్చిన మొదటి పోప్. శాంతి, కరుణ కోసం నిజమైన మానవతావాది, ప్రపంచ స్వరం. ఆయన వినయం, మానవత్వం ప్రపంచాన్ని తాకింది. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి" - మాజీ సీఎం వైఎస్ జగన్

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.