సింగపూర్లోని ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు ఆ వెంటనే పవన్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే పవన్ కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
“మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు.
“రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం” అని చిరంజీవి తెలిపారు.
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు ప్రత్యేక పూజులు చేస్తున్నారు. పిఠాపురంలోని పదో శక్తిపీఠం పాదగయ క్షేత్రం ఆలయ ప్రాంగణంలో జనసేన నాయకులు కార్యకర్తలు మృత్యుంజయహోమం నిర్వహించారు. మరోవైపు పవన్ కుమారుడి ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ నుంచి పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజా ప్రతినిధులు ప్రకటనలు కూడా చేశారు.