Housing Review: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై సిఎం సమీక్ష
Housing Review: రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ చేసిన ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించే విషయంలో ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. కోర్టు వివాదాలు, రైతుల అభ్యంతరాల నేపథ్యంలో ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం మూడేళ్లుగా ఎటూ తేలకుండా ఉంది.
Housing Review: రైతుల అభ్యంతరాలు, కోర్టు వివాదాల నేపథ్యంలో దాదాపు మూడేళ్లుగా పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపై నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలికేందుకు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పేదల సొంతింటి కల నెరవేరనుంది.
ట్రెండింగ్ వార్తలు
ఇళ్లు లేని పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు కేటాయించాలని గతంలో నిర్ణయించారు.కోర్టు కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 33వ సీఆర్డీయే అథారిటీ సమావేశంలో ఇళ్ల స్థలాల కేటాయింపు అంశానికి ఆమోదం తెలిపారు.
న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్లస్థలాలు దక్కనున్నాయి. అమరావతిలో పేలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ఇళ్లస్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేయనున్నారు. అమరావతిలో 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్లకోసం కేటాయించారు. మొత్తం 20 లే అవుట్లలో స్థలాలు కేటాయిస్తారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్నారు.
ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు కేటాయించనున్నారు. నవరత్నాలు… పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్లపట్టాలు ఇవ్వనున్నారు. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని ఆదేశించారు. నవరత్నాలు… పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడోవిడత కింద వీరికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. మేనెల మొదటివారం నాటికి.. పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లులేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం అధికారులను సూచించారు.