ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో పలు మార్పులు చేశారు అధికారులు. ఈ మేరకు మరో ప్రకటన విడుదల చేశారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీ గడువును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించారు. ఈ తేదీలోపే ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాలని సూచించారు. ఆన్ లైన్ ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 24వ తేదీలోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
అక్టోబర్ 25వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభమవుతాయి. ఇందుకు అక్టోబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.అక్టోబర్ 29వ తేదీన వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్ 2వ తేదీన తొలి విడత సీట్లు కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 4వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఈ ఏడాది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని న్యాయ కళాశాలాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు జూన్ 27న వెల్లడించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు కావడంలో తీవ్ర జాప్యం జరిగింది. మరోవైపు తెలంగాణలో చూస్తే లాసెట్ ప్రవేశాల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో స్పెషల్ ఫేజ్ నడుస్తోంది.
ఏపీ లాసెట్ పరీక్షను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు. ఎంట్రెన్స్ లో పాస్ అయిన వారితో పాటు మేనేజ్ మెంట్ కోటాలో చేరాలనుకునే చాలా మంది అభ్యర్థులు... కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు అధికారులు షెడ్యూల్ ప్రకరించారు.
ఈసారి విడుదలైన ఏపీ లాసెట్ ఫలితాలను చూస్తే… రెండేళ్ల పీజీ కోర్సులో(LLM) పురుషులు 99.51 శాతం, స్త్రీలు 99.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో పురుషులు 91.28 శాతం, స్త్రీలు 86.26 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో పురుషులు 81.91 శాతం, స్త్రీలు 78.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.