Union Budget: ఏపీకి ఆక్సిజన్ అందించేలా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్న చంద్రబాబు
Union Budget: బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు చూస్తే వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన ఆక్సిజన్లా ఉందని చంద్రబాబు చెప్పారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక చేయూతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ముందున్న లక్ష్యం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Union Budget: ‘వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునేలా కేంద్ర బడ్జెట్ ఉందని, . 2025-26 బడ్జెట్లో ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయంపై సంతోష వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తోందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీకి అన్ని విధాలా మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంది. ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్నమైన పాలసీలతో మోదీ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. అమరావతికి ఈ ఏడాదిలోనే రూ. 15 వేల కోట్లు కేటాయించబోతున్నారని రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇచ్చి కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.12,157 కోట్లు ప్రకటించిన కేంద్రం ఈ బడ్జెట్ లో రూ. 5,936 కోట్లు కేటాయించిందన్నారు విశాఖ స్టీల్ ను ఆదుకునేందుకు బడ్జెట్ కు ముందే కేంద్రం రూ. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ బడ్జెట్ లో రూ. 3,295 కోట్లు కేటాయించారన్నారు. విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు, విశాఖ-చెన్నై కారిడార్ కు రూ.285 కోట్లు కేటాయించారు. విశాఖ రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి రూ. 5 కోట్ల నిధులు ప్రకటించారని వివరించారు.
ఏపీ అభివృద్ధే లక్ష్యం, విమర్శలు పట్టించుకోం
గత విధ్వంస పాలనతో అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కుపోయింది. విభజనతోనే కాదు... గత ప్రభుత్వ విధ్వంసంతో ఏపీ దెబ్బతిందని చంద్రబాబు చెప్పారు. సంపద దోచుకునేవాళ్లు కాదు... పంచేవాళ్లు కావాలని ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని 15 % వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. దావోస్ పర్యటన విజయవంతమైందని పలు అంతర్జాతీయ పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి కల్పన ధ్యేయంగా అడుగులు వేస్తున్నామన్నారు. అభివృద్ధి , సంక్షేమం రెండూ సమానంగా ప్రజలకు అందిస్తున్నట్టు చెప్పారు.
ఏఐ, గ్రీన్ ఎనర్జీ, అగ్రికల్చర్, జీరో పావర్టీ, ఎంఎస్ఎంఈల విషయంలో కేంద్రం ఆలోచనలకు తగ్గట్టు ఏపీ అనుసరిస్తోందని కొందరు రాజకీయ లబ్ధి కోసం బడ్జెట్లో ఏపీకి చేసిన కేటాయింపులపై విమర్శలు చేస్తున్నారన్నారు.
బడ్జెట్లో ఏపీ పేరు ప్రస్తావనపై మాట్లాడుతున్నారని కేంద్రం మన రాష్ట్రానికి నిధులు కేటాయించి ఆదుకోవడం ముఖ్యం కానీ ప్రతిసారీ పేరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం ఇచ్చే చేయూతతో దేశంలోనే ఏపీని నెంబర్వన్గా తీర్చిదిద్దుతాం. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.