Tribal Acts: గిరిజన చట్టాలను మార్చే ప్రసక్త లేదన్న చంద్రబాబు, 1/70 ఆందోళనలపై వివరణ
Tribal Acts: గిరిజన హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఏజెన్సీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Tribal Acts: పర్యాటక ప్రాజెక్టుల కోసం గిరిజన చట్టాల్లో సవరణలు చేయాలంటూ ఏపీ స్పీకర్ అయ్యన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏజెన్సీలో బంద్ జరుగుతుండటంతో చట్టాలను మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము నిరంతరం పనిచేస్తున్నాం. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాము. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయ్యిందని దాని పునరుద్ధరణకు మేము కృషి చేస్తామన్నారు.
గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం ఏమాత్రం లేదని వివరణ ఇచ్చారు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని... అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజనులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
సంబంధిత కథనం