ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. ఏపీ విభజన చట్టంలో చేర్చేందుకు ప్రయత్నిస్తామన్న చంద్రబాబు-chandrababu naidu says amaravati will be legalized as the capital of andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. ఏపీ విభజన చట్టంలో చేర్చేందుకు ప్రయత్నిస్తామన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. ఏపీ విభజన చట్టంలో చేర్చేందుకు ప్రయత్నిస్తామన్న చంద్రబాబు

Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి నగరానికి శాశ్వత స్థానాన్ని కల్పించేందుక చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాల నేపథ్యంలో మున్ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి గుర్తింపుతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టపరమైన రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు అమరావతి రైతులకు ముఖ‌్యమంత్రి వివరించారు. ఏపీ పునర్విభజన చట్టానికి సవరణ చేసే అవకాశాలను కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టనున్నట్టు అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు భరోసా ఇచ్చారు.

పార్లమెంట్‌‌లో నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటులో నోటిపై చేసేలా విభజన చట్టానికి సవరణ చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, చేయిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు వివరించారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ తానని రాజధాని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. అమరావతి భవిష్యత్తుపై రైతుల్లో నెలకొన్న సందేహాలకు సీఎం చంద్రబాబు నివృత్తి చేశారు.

తెలుగు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారని, ఆ గడువు ముగిసింది కాబట్టి.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతి పనుల్ని ప్రధాని మోదీ మే 2న పునః ప్రారంభించనున్న నేపథ్యంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమ య్యారు.

భవిష్యత్తులో కూడా అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధా నిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించేలా చేయాలని రైతులు ముఖ్యమంత్రిని కోరారు. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నందున చంద్రబాబు చెబితే ప్రధాని మోదీ వింటారని రైతులు చెబుతుండగా ముఖ్యమంత్రి అది సరికాదన్నారు.కూటమిలో ఉండగా డిమాండ్ చేయకూడదని, సామ స్యంగా సమస్యలను వివరించి అన్నీ సాధించుకుందామని రైతులకు చెప్పారు.

రైతులకు ఆహ్వానం..

అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుకాబోతుందని...రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలక అడుగు అవుతుందని సిఎం అన్నారు.

మే 2వ తేదీ ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనుల రీ స్టార్ట్ కార్యక్రమం, రైతుల సాధకబాధకాలపై వారితో చర్చించారు. రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతులు ఉండవల్లిలోనివాసంలో ముఖ్యమంత్రి ఆహ్వానంతో సిఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రైతులతో సిఎం చంద్రబాబు చర్చించారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఎయిర్ పోర్టు, స్టేడియం నిర్మాణంతో పెరగనున్న భూముల విలువ

రైతులతో సమావేశంలో రాజధాని అవసరాలకు అదనంగా భూసేకరణ అంశంపై కూడా చర్చ జరిగింది. ‘గతంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూ సేకరణ జరిగినప్పుడు 5 వేల ఎకరాలు ఎందుకుని కొందరు ప్రశ్నించారని ముందు చూపుతో సేకరించబట్టే ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు పెద్ద హోటళ్లు, మాల్స్ వచ్చి ఎకనమిక్ యాక్టివిటీ పెరిగింది. దీంతో అక్కడి చుట్టుపక్కల భూములకు విలువ పెరిగి రైతులకు మేలు చేకూరిందన్నారు.

అమరావతిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరం అవుతుంది. వీటి అవసరాలకు అనుగుణంగా భూమిని తీసుకోవాల్సి ఉంటుంది. రాజధాని కోసం స్వచ్చంధంగా భూములు ఇచ్చిన రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా, వారికి నష్టం జరిగేలా ఏ కార్యక్రమం, నిర్ణయం ఉండదని సిఎం అన్నారు.

కృష్ణానదిపై మరో మూడునాలుగు వారధిలు కూడా వస్తాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయి. ఇతర ప్రాంతాలకు కనెక్టవిటీ పెరుగుతుంది. రాజధాని విస్తరించి పెద్ద ఎత్తున సంస్థలు, పెట్టుబడులు వస్తాయి. అదనపు భూసేకరణ కారణంగా ఈ ప్రాంతంలో ధరలు పడిపోతాయనే అపోహలకు గురికావద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలకు గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని రైతులు కోరగా...శాతవాహన కాలం నుంచి అమరావతి ఉద్యమం వరకు జరిగిన పరిణామాలన్నీ క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. అంతేకాకుండా రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో ప్రస్తుతం నివాసం ఉంటూ పట్టాలేని వారికి పట్టాలివ్వాలని వారు కోరగా...ఈ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం