Modi - Chandrababu: ఎన్నాళ్లకెన్నాళ్లకు… ప్రధాని మోదీతో చంద్రబాబు!
ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. చాలా రోజుల తర్వాత వీరి కలయిక ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
chandrababu meet pm modi: ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు... ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్లో కేంద్రం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం... మోదీతో చంద్రబాబు ఐదు నిమిషాలకు పైగా మాట్లాడారు. మోదీ, చంద్రబాబు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు బయటికి వచ్చిన తర్వాత... వీరిద్దరూ కలిసిన సందర్భాలు లేవు.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు దేశ, రాష్ట్ర పరిణామాలపై మీడియా ప్రతినిధులతో చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఏపీలో ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు వేచి చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కుప్పకూలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రవిభజన తర్వాత అన్నిరంగాల్లో ఏపీని.. అగ్రభాగాన నిలిపేందుకు పునాదులు వేశామని గుర్తు చేశారు. పోలవరం, అమరావతిని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు.
మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు... మోదీని కలవటంతో... ఏయే అంశాలపై చర్చించుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీలో ఇప్పటికే బీజేపీ - జనసేన కలిసి పని చేస్తున్నాయి. 2014లో మాదిరిగా మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తాయని గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని పరోక్షంగా జనసేన ప్రస్తావిస్తున్నప్పటికీ... బీజేపీ నేతల నుంచి మాత్రం క్లారిటీ లేదు. ఇక త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ అప్పట్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా జోరుగా చర్చ నడిచిన సంగతి తెలిసిందే.