ఏపీలో సెకీ అదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని సెంటర్‌ ఫర్‌ లిబర్టీ డిమాండ్… మద్దతిచ్చిన మాజీ బ్యూరోక్రాట్లు-center for liberty demands cancellation of seci adani power deal in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో సెకీ అదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని సెంటర్‌ ఫర్‌ లిబర్టీ డిమాండ్… మద్దతిచ్చిన మాజీ బ్యూరోక్రాట్లు

ఏపీలో సెకీ అదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని సెంటర్‌ ఫర్‌ లిబర్టీ డిమాండ్… మద్దతిచ్చిన మాజీ బ్యూరోక్రాట్లు

Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై విద్యుత్ భారాలకు కారణమవుతున్న ఒప్పందాలను రద్దు చేయాలని సెంటర్‌ ఫర్ లిబర్టీ డిమాండ్‌ చేసింది. సెకీ అదానీ ఒప్పందాల నుంచి ఏపీని కాపాడాలనే డిమాండ్‌కు రిటైర్డ్‌ డీజీ ఏబీ వెంకటేశ‌్వరావు, ఆర్థిక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌ మద్దతు ఇచ్చారు.

సెకీ అదానీ విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలని సెంటర్‌ ఫర్ లిబర్టీ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీ -అదాని లతో చేసుకున్న 25 సంవత్సరాల సౌర విద్యుత్‌ ఒప్పందంతో ఏపీ ప్రజలకు లక్షా పాతిక వేల కోట్ల నష్టం కలుగుతుందని ఈ ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్రకటించడంపై పౌర సమాజ ప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సెంటర్‌ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాజీ బ్యూరోక్రాట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సెకి- అదానీ ఒప్పందంతో ప్రజలకు అపార నష్టం జరుగుతుందని, చంద్రబాబు గతంలో సెకి అదానీ ఒప్పందంపై గతంలో శ్వేత పత్రం విడుదల చేశారని, ఈ ఒప్పందంతో ప్రజలపై లక్షా 20వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారని గుర్తు చేశారు.

  • గతంలో 12 రూపాయలు ఉన్న యూనిట్ సోలార్ ధర గత పది సంవత్సరాలలో 2 రూపాయలకు చేరిందని, మన విధానాలతో విద్యుత్తు రంగాన్ని నాశనం చేసి కోర్పొరేట్ కంపెనీల పెత్తనాన్ని సృష్టిస్తున్నారని ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
  • స్మార్ట్ మీటర్ల వలన అపార నష్టం జరుగుతుందని, వీటిని అదాని కంపెనీ సరఫరా చేస్తుందని స్మార్ట్ మీటర్ దోపిడీ ధరను 90 నెలల్లో ప్రజల దగ్గరే వసూలు చేస్తున్నారని వివరించారు.
  • గత ప్రభుత్వ అవినీతిని ప్రస్తుత ప్రభుత్వం కాపాడుతోందని, ఆంధ్ర అదానీ షిరిడి సాయి అని అన్నారని, షిరిడి సాయి 40 కోట్ల రూపాయల ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో టిడిపికి ఇచ్చిందని గుర్తు చేశారు. ఇది కేవలం తెల్ల ధనం మాత్రమేనని నల్ల ధనం ఎంత ఇచ్చి ఉంటారో ఊహించవచ్చన్నారు. అటువంటి కంపెనీకి ప్రజలకు అపార నష్టం చేసే ప్రాజెక్టులు కట్టబెట్టడాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

నాణ్యమైన విద్యుత్ డిస్కమ్‌ల బాధ్యత- పీవీ రమేష్‌

  • నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు సరఫరా చేసే బాధ్యత విద్యుత్ పంపిణీ సంస్థలతదని, నేడు అవి అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, వాటి అప్పు రూ.40 వేల కోట్ల రూపాయలకు చేరుకుందని రిటైర్డ్‌ ఐఏఎస్ పీవీ రమేష్‌ వివరించారు.
  • విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టడం మానేశాయని, ప్రైవేటీకరణ హేతుబద్దంగా జరగలేదని, వ్యవసాయానికి, గృహాలకు, ఇండస్ట్రీలకు కీలకమైన విద్యుత్తు రంగాన్ని విస్మరించారన్నారు.
  • 2019లో ఏపీలో మిగులు విద్యుత్‌ ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన జగన్ మోహన్ రెడ్డి , ముఖ్యమంత్రి అయినా తరువాత 7GW విద్యుత్తు అదనంగా కొనడానికి ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేవారు.
  • APERC సభ్యులను ప్రభుత్వమే నియమిస్తుండటం వల్ల వాళ్ళు ముఖ్యమంత్రి కనుసన్నల్లో పని చేస్తున్నారే తప్ప నిస్పక్షపాతంగా పని చేయడం లేదన్నారు.
  • సెకీ అదానీ ఒప్పందంపై అమెరికా గ్రాండ్ జూరి అభియోగాలు నమోదు చేసి చార్జిషీట్ లో 1750 కోట్ల అవినీతి జరిగిందని అభియోగం మోపిందని, ఇది భారీ అవినీతి అని వివరించారు. ఈ అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చడానికి వెంటనే FIR రిజిస్టర్ చెయ్యాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
  • పీపీఏలు తెచ్చుకుంటే వందల కోట్ల ఆదాయం-ఏబీ వెంకటేశ్వరరావు
  • 1980 లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఉత్పత్తిని ప్రైవీటకరించారని మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.
  • ప్రభుత్వం నుంచి ఒక్క విద్యుత్ కొనుగోలు ఒప్పందం తెచ్చుకుంటే చాలు, దాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించవచ్చని రుజువైందన్నారు.
  • ఒక్క ఎలెక్ట్రాన్ కూడా ఉత్పత్తి చేయకుండా, ప్రయివేట్ విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు వందల కోట్లు కట్టిబెట్టిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజుకి గత ఒప్పందాల ఆధారంగా, యూనిట్ 14 రూపాయలకు కొంటున్నారని వివరించారు.
  • విద్యుత్‌ సరఫరా ఛార్జీలను రద్దు చేస్తే ఆ భారం చివరకు ప్రజలపైనే పడుతోందన్నారు. 1750 కోట్ల లంచం కోసం లక్ష కోట్ల భారం ప్రజలమీద వెయ్యడం దుర్మార్గమని, కేవలం 2% లంచం కొరకు ప్రజలమీద ఇంత భారం వేయడం, రాజకీయ నాయకుల దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు.
  • థర్మల్ కేంద్ర స్థాపన చాలా కష్టం, ఖర్చు తో కూడిన పని అని సోలార్ విద్యుత్ కి ఇటువంటి సమస్య లేదని ఎంత అవసరమో అంతే ఉత్పత్తి చేయవచ్చని వికేంద్రీకరించి డిస్ట్రిబ్యూట్ చేయటానికి అవకాశం ఉన్నది కేవలం సోలార్ ఎనర్జీ లో మాత్రమే అన్నారు.
  • 5 సంవత్సరాలు అధికారంలో ఉండే ప్రభుత్వం 25 సంవత్సరాల ఒప్పందం చెయ్యడం ఏ విధంగా నైతికమని ప్రశ్నించారు. 5 సంవత్సరాలు దాటి ప్రభావం చూపే నిర్ణయాలు, ప్రాజెక్టుల కోసం, ఏకాభిప్రాయ సాధన కృషి జరగాలి. భవిష్యత్తరాల మీద ప్రభావం చూపే అన్ని నిర్ణయాలు ప్రజాభిప్రాయం పొందిన తరువాతే చెయ్యాల్నారు.
  • వైసీపీ ప్రభుత్వంలో రూ. 1750 కోట్లు లంచంగా ఇచ్చి సౌర ఒప్పందం చేసుకున్నారని అమెరికా ప్రభుత్వ న్యూయార్క్ ఈస్టిన్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదు అయిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆదానీపై కేసు నమోదు చేయాలని జ్యుడీషియల్ విచారణ హైకోర్టు న్యాయమూర్తి తో చేపట్టాలని, సోలార్ విద్యుత్‌ ఉత్పత్తిని వికేంద్రీకరించాలని స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని ఆపాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం