CBI on Viveka Murder Case : ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు-cbi once again issued notices to kadapa mp avinash reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cbi Once Again Issued Notices To Kadapa Mp Avinash Reddy

CBI on Viveka Murder Case : ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

HT Telugu Desk HT Telugu
Feb 18, 2023 07:31 PM IST

CBI on Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి.. సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 24న మరోసారి విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డిని మొదటి సారి గత నెల 28న సీబీఐ విచారించింది.

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి

CBI on Viveka Murder Case : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. కేసుకి సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలతో.. పలువురుకి సీబీఐ వరుసగా నోటీసులు జారీ చేస్తోంది. అనుమానితులు, సాక్షులని విచారించి... మరింత సమాచారం రాబడుతోంది. ఈ క్రమంలో.... కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు పంపింది. కడపలో ఉన్న ఎంపీకి... వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిన అధికారులు... ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. 160 సీఆర్పీసీ మేరకు జారీ చేసిన నోటీసుల ప్రకారం... ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు.

ట్రెండింగ్ వార్తలు

వివేకా హత్య కేసులో ముందు నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డిని... సీబీఐ అధికారులు మొట్టమొదటి సారిగా ఈ ఏడాది జనవరి 28న విచారించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించిన అధికారులు... అవినాశ్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పదుల కొద్దీ ప్రశ్నలు సంధించారు. రక్తపు మరకలు తుడిచిన విషయం తెలుసా అని.. వివేకాకు గుండెపోటు అని ఎందుకు చెప్పారని ప్రశ్నించారని సమాచారం. అలాగే.. ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్స్ పైనా ఆరా తీశారు. ఆయన కాల్ డేటా ఆధారంగా... ఫిబ్రవరి మొదటి వారంలో కడపలో నవీన్ మరియు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ దాదాపు ఆరున్నర గంటల పాటు ప్రశ్నించింది. వారి నుంచి కూడా కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

నవీన్, కృష్ణమోహన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎంపీ అవినాశ్ రెడ్డిని మరోసారి విచారించాలని సీబీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వారు వెల్లడించిన పలు అంశాలను ఆయన ముందు ఉంచి... వివరణ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే... ఫిబ్రవరి 24న మరోసారి విచారణకు హాజరుకావాలని ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. నోటీసుల విషయాన్ని ధృవీకరించిన కడప ఎంపీ... తప్పనిసరిగా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. దర్యాప్తు బృందం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని.. వారి సందేహాలను నివృత్తి చేస్తానని చెప్పారు. ఈ కేసులో సీబీఐ ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

మరోవైపు.... వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేయొద్దని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలకపాత్ర పోషించారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలని కోరారు. దీంతో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

IPL_Entry_Point