CBI Lakshmi Narayana : విశాఖ నుంచి పోటీ చేస్తానన్న లక్ష్మీనారాయణ....-cbi ex jd lakshmi narayana ready to contest from visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cbi Ex Jd Lakshmi Narayana Ready To Contest From Visakhapatnam

CBI Lakshmi Narayana : విశాఖ నుంచి పోటీ చేస్తానన్న లక్ష్మీనారాయణ....

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 08:18 AM IST

CBI Lakshmi Narayana వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, విశాఖపట్నం నుంచి పోటీ చేయడానికి తాను ప్రాధాన్యతనిస్తున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయాలా, అసెంబ్లీకి పోటీ చేయాలా అనేది ప్రజల అభీష్టం మేరకు నిర్ణయిస్తానని ప్రకటించారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

CBI Lakshmi Narayana సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ప్రజాభిప్రాయం తర్వాత ఎంపీగా పోటీ చేయాలా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేది నిర్ణయిస్తానని ప్రకటించారు. ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమన్న లక్ష్మీనారాయణ రాష్ట్రంలోని 26 జిల్లాలను 26 రాజధానుల స్థాయిలో అభివృద్ది చేయాలని అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

విశాఖను ఐటీ టూరిజం రాజధానిగా, శ్రీకాకుళం కొబ్బరి, జీడిపప్పు, పనస, గోదావరి జిల్లాల్లో వరి, ఆక్వాలకు, రాయలసీమలో ఖనిజాభివృద్ధి చేయొచ్చన్నారు. అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా జిల్లాల వారీగా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఏ జిల్లాకు, ఆ జిల్లాను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయొచ్చన్నారు. అల్లూరి జిల్లా లంబసింగి, అరకులోయ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. విశాఖలో శీతాకాల సమావేశాలు నిర్వహిస్తు కర్నూలు మరో సమావేశాల నిర్వహణ ద్వారా పరిపాలన చేపట్టాలని సూచించారు.

ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అనివార్య కారణాలతో ఉప ఎన్నిక అనివార్యమైతే, ఎన్నికల నిర్వహణకు బదులు, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి అవకాశం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘానికి సూచించినట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. కనీసం 50శాతం పోలింగ్ నమోదు కాని నియోజక వర్గాల్లో మళ్లీ పోలింగ్ నిర్వహించేలా నిబంధనలు మార్చాలని సూచించారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారికి అదనపు ఆదాయ పన్ను విధించే సంప్రదాయం కొన్ని దేశాల్లో ఉందన్నారు. 'ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల విధానంతో ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. అన్ని జిల్లాల అభివృద్ధితోనే సాధికారిత సాధ్యమవుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని ఉండాలంటున్నారని, రాయలసీమకు ఒక రాజధాని కావాలని అక్కడి ప్రజలు డిమాండు చేస్తున్నారు. దీని వల్ల ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తుతాయి తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. విశాఖను పరిపాలన రాజధాని చేసినంత మాత్రాన ఏమీ జరగదని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో శాసనసభ సాక్షిగా తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ ప్రతి జిల్లాను ఒక రాజధానిగా తయారు చేస్తే అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ' ఆంధ్రుడా మేలుకో ' కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు.

'మహారాష్ట్ర తరహాలో ప్రతి జిల్లాను ఒక రాజధానిగా అభివృద్ధి చేస్తే ప్రాంతాల మధ్య ఎటువంటి వివాదాలు తలెత్తవని, అక్కడ 22 ఏళ్లు పని చేసిన అనుభవంతో చెబుతున్నానని ఆ రాష్ట్రంలో అనేక పట్టణాలు వృద్ధి చెందాయిని, ముంబై, పుణే, థానే, ఔరంగాబాద్‌, నాగ్‌పూర్‌, నాసిక్‌ చుట్టూ ఎన్నో పరిశ్రమలొచ్చి ఉద్యోగాలు పెరిగాయన్నారు. అక్కడి ప్రజలు బయట రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం ఎక్కడా పెద్దగా కనిపించరని మనవాళ్లు మాత్రం ఉద్యోగాలు లేక అన్ని రాష్ట్రాల్లో ఉంటారన్నారు. ఏపీలోనూ ప్రతి జిల్లాను ఆ విధంగా తీర్చిదిద్దితే మనకూ ఎక్కడికీ వెళ్లాల్సిన గతి పట్టదన్నారు.

తమిళనాడులో ప్రతి జిల్లా ఏదో ఒక రంగంలో ముందుకువెళ్తుందన్నారు. 'హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్‌ ముంబయిలో ఉంటుంది. నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌లో రెండు బెంచ్‌లు ఏర్పాటు చేశారు. అదే విధంగా అమరావతిలో హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్‌ పెట్టి విశాఖ, కర్నూలులో బెంచ్‌లు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లోని న్యాయపరమైన సమస్యలను అక్కడికి తీసుకువెళ్లవచ్చన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాగ్‌పూర్‌లో జరుగుతాయన్నారు. ఇక్కడ కూడా శీతాకాల సమావేశాలు విశాఖ, కర్నూలులో పెట్టుకోవచ్చని, ఒకే ప్రాంతంలో అన్ని రకాల కార్యాలయాలు ఉండే విధానం అన్ని రాష్ట్రాల్లో ఉందని, ఆ విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించకూడదన్నారు.

IPL_Entry_Point