పిఠాపురం టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. చినజగ్గంపేటకు చెందిన తెలుగుదేశం నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తనను దూషించారని టీడీపీ నాయకులపై జనసేన నేత ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లింది.
ఎమ్మెల్సీ నాగబాబు శుక్రవారం, శనివారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు టీడీపీ నేత వర్మ దూరంగా ఉన్నారు. అటు నాగబాబు పర్యటించిన ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు వర్మకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులు పోటీగా నినాదాలు చేశారు. స్వల్ప ఘర్షణ కూడా జరిగింది.
పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ వ్యవహారంపై నాగబాబు సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో జనసేన నాయకులు టీడీపీ లీడర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే.. పోలీసులకు ఫిర్యాదు చేయడంపై.. టీడీపీ క్యాడర్ భగ్గుమంటోంది. చంద్రబాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పిఠాపురంలో చాలా రోజులుగా టీడీపీ- జనసేన మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వర్మకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని, జనసేన నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ జనసేన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో నాగబాబు పవన్ కల్యాణ్ గెలుపు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే పవన్ గెలుపులో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక పాత్ర పోషించారు. అయితే వర్మ గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ఇక్కడి ప్రజలు, జనసైనికుల కృషి ఎంతో ఉందని నాగబాబు అన్నారు. పవన్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అని వ్యాఖ్యానించారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి చేసినవేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. పవన్ గెలుపునకు రెండు ఫ్యాక్టర్లు పనిచేశాయని.. అందులో ఒకటి జనసేనాని అయితే.. ఇంకొకటి పిఠాపురం ప్రజలు, జనసైనికులు అని నాగబాబు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం