Balabhadrapuram : బలభద్రపురంలో 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు,38 అనుమానిత కేసులు -మంత్రి సత్యకుమార్
Balabhadrapuram Cancer Screening : తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ సర్వే 38 అనుమానిత క్యాన్సర్ కేసులను గుర్తించామన్నారు. అనుమానిత కేసులలో 10% నుంచి 15% వరకు పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.
Balabhadrapuram Cancer Screening : తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి ఎమ్మె్ల్యే బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవ్వడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నట్టు సభ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వేను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ అంశంపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆరోగ్య శాఖ ఇప్పటికే నవంబర్ 2024 నుంచి నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ చేసే సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ను నిర్వహిస్తోందని ఇప్పటికే 47% జనాభాను కవర్ చేసిందని తెలిపారు.
బలభద్రపురం గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలకై 31 వైద్య బృందాలను నియమించగా వారిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలు, సహాయక నర్సులు, గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. వీరికి ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, కాకినాడ వైద్య కళాశాల, జీఎస్ఎల్ వైద్య కళాశాల నిపుణులు తగిన సహాయం అధిస్తున్నాయని తెలిపారు. ప్రసుతం క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఫింక్ రిబ్బన్ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ పై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.
38 మందిలో లక్షణాలు
బలభద్రపురం గ్రామంలో 3,500 గృహాలుండగా 10,800 మంది జనాభా ఉన్నారు. వైద్య బృందాలు 2025 మార్చి 22, 23 తేదీలలో 8,830 మంది వ్యక్తులను కవర్ చేస్తూ 2,803 గృహాలను సర్వే చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా అనుమానిత క్యాన్సర్ కేసులను గుర్తించడం, గత మూడేళ్లుగా క్యాన్సర్ వల్ల సంభవించిన మరణాలను నమోదు చేస్తున్నారన్నారు. సర్వేలో అనుమానిత క్యాన్సర్ కేసులతో 38 మంది వ్యక్తులను గుర్తించగా... అనుమానిత కేసులలో సుమారు 10% నుంచి 15% వరకు క్యాన్సర్కు పాజిటివ్గా ఉంటుందని గమనించామని తెలిపారు. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఒక్కొక్కటి 6 కేసులుగా ఉండగా,7 మందిలో గర్భాశయ క్యాన్సర్ అనుమానిత కేసులుగా, 2 కేసుల్లో మెదడు క్యాన్సర్, 3 కేసుల్లో ఊపిరి తిత్తుల అనుమానిత క్యాన్సర్ కేసులుగా నమోదు చేయడం జరిగిందని చెప్పారు.
అలాగే 14 మంది వ్యక్తులకు బహుళ రకాల క్యాన్సర్ ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. సర్వే బృందాలు 17 మంది క్యాన్సర్ రోగులు చికిత్సలు పొందుతున్నట్టు గుర్తించగా వారిలో రొమ్ము క్యాన్సర్ (5గురు), బహుళ క్యాన్సర్ రకాలు (9మంది), మెదడు క్యాన్సర్, రక్త క్యాన్సర్ కు సంబంధించి మరో ముగ్గురు ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. గతంలో నిర్ధారించిన కేసుల్లో 15 మంది తమ క్యాన్సర్ చికిత్సను విజయవంతంగా పొందారని ఈ కేసుల్లో ఎక్కువ మంది ఊపిరితిత్తుల క్యాన్సర్,రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్కు చికిత్సలు పొందినట్టు చెప్పారు. గత మూడు సంవత్సరాలలో 19 క్యాన్సర్ సంబంధిత మరణాలు సంభవించినట్టు ఈ సర్వే బృందాలు గుర్తించాయని తెలిపారు.
పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా క్యాన్సర్ భారం క్రమంగా పెరుగుతున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నోటి, రొమ్ము క్యాన్సర్లకు 18+ వయస్సు గల మొత్తం జనాభాకు, గర్భాశయ క్యాన్సర్లకు 30+ వయస్సు గల మహిళలకు సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ను చేపట్టినట్లు చెప్పారు. మొత్తం 4.09 కోట్ల మందికి స్కీనింగ్ చేయాలని లక్ష్యం కాగా ఇప్పటికే 1.93 కోట్ల జనాభా స్క్రీనింగ్ పూర్తి చేసి 1,45,649 అనుమానిత కేసుల్లో 95,263 మందిని పీహెచ్సీ వైద్య బృందాలు పరీక్షించాయని తెలిపారు. కాగా రాష్ట్రంలో 2022 నుంచి 2025 వరకు 1,13,363 క్యాన్సర్ కేసులు చికిత్సలు అందించగా వాటిలో అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలో 5,931 (5.23%) కాగా మిగతావి విజయనగరం,శ్రీకాకుళం, గుంటూరు మరియు విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఈసమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు మాట్లాడుతూ... క్యాన్సర్ అనేది నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాధని, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. సకాలంలో తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ అనుమానిత కేసులుగా గుర్తించిన వారికి మెరుగైన చికిత్సలకై విశాఖపట్నం హోమీ బాబా క్యాన్సర్ కేంద్రం ద్వారా గాని లేదా ఎన్టీఆర్ వైద్య సేవలో ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని వారికే ఆప్సన్ ఇచ్చామన్నారు. అంతేగాక క్యాన్సర్ కు సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవలో 256 ప్రొసీజర్లను పొందుపర్చినట్లు తెలిపారు.
సంబంధిత కథనం