BRS AP President: 3 ఏళ్లలోనే రాజధాని నిర్మిస్తాం... పొత్తులపై తోట రియాక్షన్ ఇదే
BRS AP President Thota Chandrasekhar News: బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే 3 ఏళ్లలోనే రాజధానిని పూర్తి చేస్తామన్నారు. పొత్తులపై కూడా ఆయన స్పందించారు.
BRS AP President Thota Chandrasekhar: దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో పర్యటించిన ఆయన... మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి కేసీఆర్ 1000 కోట్లు ఆఫర్ చేశారని కొందరు నేతలు చెబుతున్నారని.. అలాంటి వ్యాఖ్యలు వారి దిగజారుడుతనానికి అర్థం పడుతుందని విమర్శించారు. ఇలాంటి కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. దేశంలో రైతాంగ సమస్యలను ఏ ఒక్క పార్టీ పట్టించుకోలేదని... ఏపీకి రాజధాని లేకపోవడం ప్రజల దురదృష్టకరమని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
బీఆర్ఎస్ పార్టీ అన్నీ రాష్ట్రాలలో విస్తరిస్తుందని చెప్పారు తోట చంద్రశేఖర్. ముఖ్యమైన రైతాంగ సమస్యలపై పార్టీ దృష్టి పెడుతుందని... నిరుద్యోగం, ధరల నియంత్రణ లేకపోవడం ప్రధానంగా ఉన్నా సమస్యలు అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి విభజన హామీలను సాధించుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనలో వైసీపీ,టీడీపీ పార్టీలు విఫలం అయ్యాయని దుయ్యబట్టారు. పెద్ద పార్టీల లీడర్ల ను అవహేళన చేసే అభియోగాలు మోపడం తగదన్న ఆయన... పొత్తులు ఏ పార్టీతో అయినా పెట్టుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పొత్తు మేము పెట్టుకుంటే సంసారం ఇతరులు పెట్టుకుంటే వ్యభిచారం అన్నట్టు మాట్లాడడం సరికాదన్నారు. పొత్తు కోసం కేసీఆర్ డబ్బు ఆఫర్ చేశారని అభియోగాలు చేయడం వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసినట్టు అవుతుందన్నారు.
ఈ సందర్భంగా ఏపీ రాజధాని అంశంపై స్పందించిన ఆయన.... తాము అధికారంలోకి వస్తే 3 నుంచి 4 ఏళ్లలోనే ప్రజలు కోరుకునే రాజధానిని నిర్మించి తీరుతామని అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఓ కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో తమ పార్టీలోకి చాలా మంది వస్తారని వివరించారు.