కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సాలను జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య తేదీలతో పాటు వాహనసేవల వివరాలను వెల్లడించింది. ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని పేర్కొంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది. ఏప్రిల్ 5న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.
ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కల్యాణానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించే ఈ కల్యాణానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టిటిడి అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయంతో పని చేస్తూ.. ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై టీటీడీ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయం పరిసరాలు, కల్యాణ వేదిక సమీపంలో ట్రాఫిక్ , భధ్రతా, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిక, స్వామివారి తలంబ్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు.
సంబంధిత కథనం