ఈ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని.. ఈవో ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి వివరించారు. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వస్తామన్నారు. ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని, ఉత్సవాల సందర్భంగా ఆలయం, పరిసరాలు విద్యుద్దీప కాంతులతో ముస్తాబు చేస్తామని చెప్పారు.
పశ్చిమగోదావరి జిల్లాలో చిన తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల.. చాలా విశిష్ట, పవిత్రమైన చారిత్రక పుణ్యక్షేత్రం. భక్తుల తాకిడి నిరంతరం ఉంటుంది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కాలినడకన పదుల కిలో మీటర్లు నడిచి స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజులు చేస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో మే 7వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ద్వారకా తిరుమల చిన వెంకన్న దివ్య బ్రహ్మోత్సవాలకు శేషాచలం ముస్తాబుకానుంది.
ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలు జరుపుతారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని.. ఆయా రోజుల్లో ఆలయంలో స్వామివారి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జీత సేవలు రద్దు చేశారు. మే 11వ తేదీన రాత్రి బ్రహోత్సావాల్లో ముఖ్యమైన ఘట్టం శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సం అంగరంగ వైభవంగా జరగనుంది. మే 12వ తేదీన రథోత్సవం జరుగుతోంది.
మే 7వ తేదీ ఉదయం స్వామి వారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి ఏడు గంటలకు గజ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం ఉంటుంది. మే 8వ తేదీన ధ్వజారోహణ, అంకురార్పణ, రుత్విగ్వరణను నిర్వహిస్తారు. అదే రాత్రి తొమ్మిది గంటలకు శేష వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. మే 9వ తేదీన ఉదయం ఏడు గంటలకు సూర్య ప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. మే 10వ తేదీ రాత్రి ఏడు గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతోంది.
మే 11వ తేదీన రాత్రి ఎనిమిది గంటల నుంచి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుగ వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. మే 12వ తేదీన రాత్రి ఏడు గంటలకు రథోత్సవం, మే 13వ తేదీన ఉదయం ఏడు గంటలకు చక్రస్నానం, అపభృధోత్సవం, రాత్రి ఏడు గంటలకు వేద సభ, శ్రీవారి ధ్వజా అవరోహణ జరుగుతాయి. మే 14వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి ఏడు గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవ, శ్రీపుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం