Vizag MLC Election 2024 : ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స - వైఎస్ జగన్ నిర్ణయం
AP MLC Elections 2024 : విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును ప్రకటించింది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.అభ్యర్థులపై ఎంపికపై వైఎస్ జగన్ నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం బొత్సను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. అందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఉన్నాయి. ఈ సంఖ్య బలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికలు ఆగస్టు 30న జరగనున్నాయి.
స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లున్న వైసీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవాల్సి ఉంది. ఒకవేళ ఓటమి చెందితే కూటమి ప్రభుత్వానికి తొలి పరాభవం ఎదురైనట్లే అవుతుంది. ఇటీవలే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా జరిగింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాకుండా…. ప్రతిపక్ష బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకుంది.
అఖండ మెజార్టీ తరువాత జరిగే తొలి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి ప్రయత్నిస్తుంది. అయితే ప్రతిపక్ష వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ స్థానంలో కూటమికి గెలుపు పెద్ద సవాల్గా ఉంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలకే జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకం అయింది.
అలాగే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీ తన ఉనికిని సవాల్గా మారింది. వైసీపీ ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే…. అధికారం కోల్పోయిన తరువాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుంది. కనుక ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అధికార టీడీపీ కూటమికి, ప్రతిపక్ష వైసీపీకి సవాల్గా మారాయి.
ఆగస్టు 30న జరిగే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి పరీక్ష ఎదుర్కొబోతుంది. సంఖ్య బలం బట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అత్యధికంగా వైసీపీకి ఉన్నారు. అధికార టీడీపీకి చాలా తక్కువ ఉన్నారు. అయితే ప్రతిపక్ష వైసీపీకి ఎక్కువ మంది స్థానిక సంస్థల సభ్యులు ఉన్నప్పటికీ, వారంతా వైసీపీ అభ్యర్థికి ఓటేస్తారా? అనే మీమాంసం నెలకొంది. అయితే తక్కువ మంది స్థానిక సంస్థల సభ్యులున్న అధికార టీడీపీ గెలవడానికి వైసీపీ సభ్యులను లాగాల్సి ఉంటుంది. టీడీపీ ఆ ప్రయత్నాలను మొదలుపెట్టింది. అయితే వైసీపీ నుంచి వలసలను నివారించడానికి ఆ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. మొత్తంగా ఇక్కడ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది….!