అన్నదాత సుఖీభవ, తల్లికి వందనంపై బిగ్ అప్డేట్-మే నెలలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన-big update on annadada sukhibhava talliki vandanam cm chandrababu announces to start in may ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అన్నదాత సుఖీభవ, తల్లికి వందనంపై బిగ్ అప్డేట్-మే నెలలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన

అన్నదాత సుఖీభవ, తల్లికి వందనంపై బిగ్ అప్డేట్-మే నెలలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన

సింహాచలంలో జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఈ ప్రమాదం సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన...పలు కీలక విషయాల్లో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

అన్నదాత సుఖీభవ, తల్లికి వందనంపై బిగ్ అప్డేట్-మే నెలలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన

సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగి ఏడుగురు భక్తులు చనిపోవడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి వెళ్దామనుకుంటే, భక్తులు ఇబ్బంది పడతారని, దర్శనాలకు అంతరాయం ఏర్పడుతుందనే వెళ్లలేదన్నారు. అమరావతి నుంచే ప్రమాదంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని, ఈ ఘటనపై అంశాలను పర్యవేక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

మే నెలలో అన్నదాత, తల్లికి వందనం

వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్‌ స్థాయి నేతలతో సీఎం చంద్రబాబు బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మే 2న జరిగే అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతిలో మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్టు

రాష్ట్ర ప్రజలు గర్వంగా చెప్పుకొనేలా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులతో అన్నారు. ఎల్లుండి జరిగే అమరావతి పనుల పునఃప్రారంభానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్టు అన్నారు.

క్యాడర్ ను నిర్లక్ష్యం చేయొద్దు

పార్టీ క్యాడర్‌ను నిర్లక్ష్యం చేయొద్దని నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమమైన మూడు పార్టీల నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలను గుర్తించి, నామినేటెడ్‌ పదవులు భర్తీ చేశామన్నారు. ఈసారి మహానాడు కడపలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఏ ఎన్నిక జరిగినా ఎన్డీయే గెలవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ చేసినన్ని తప్పులు ఏ పార్టీ చేయాలేదని మండిపడ్డారు.

అమరావతికి ప్రధాని రాక

"మే 2న అమరావతి పనుల పునః ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. రూ.49,040 కోట్ల పనులకు పీఎం శంకుస్థాపన చేస్తారు. వర్చువల్‌ విధానం ద్వారా రాష్ట్రంలోని డీఆర్‌డీవో, డీపీఐపీ, నాయ్‌, రైల్వే ప్రాజెక్టులకు సుమారు రూ.57,962 కోట్ల మేర శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు" -సీఎం చంద్రబాబు

టీసీఎస్ రాకతో ఉద్యోగాలు

"వైసీపీ పాలకులు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని రైతులు అలుపెరుగని పోరాటం చేసి అమరావతిని సాధించారు. వారి పోరాటానికి నేడు ఫలితం లభించింది. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేస్తాం. ఆర్థిక కష్టాలున్నా పది నెలల్లో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. విశాఖలో టీసీఎస్‌ రాకతో రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. భోగాపురం ఎయిర్ పోర్టు రెడీ అవుతుంది" - సీఎం చంద్రబాబు

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం